TS Sangareddy Assembly Constituency: TS Election 2023: కాంగ్రెస్‌లో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి..! కానీ ఇప్పుడు..?
Sakshi News home page

TS Election 2023: కాంగ్రెస్‌లో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి..! కానీ ఇప్పుడు..?

Aug 27 2023 4:18 AM | Updated on Aug 27 2023 10:47 AM

- - Sakshi

సంగారెడ్డి: కాంగ్రెస్‌లో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్నట్లుగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారింది ఈ అసెంబ్లీ స్థానం టికెట్‌ కోసం పోటాపోటీ నెలకొంది. తనకు ఎదురు లేదనుకున్న చోట తొలిసారిగా నలుగురు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మాజీ ఉపముఖ్యమంత్రి, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ ప్రధాన అనుచరుడు, మరికొందరు, జగ్గారెడ్డి తరపున ఆయన సతీమణి నిర్మలా దరఖాస్తు చేసుకున్నారు. అయితే టీడీపీలో వివిధ పోస్టుల్లో పనిచేసిన సంగమేశ్వర్‌, రాజనర్సింహ వెంటే ఉంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ పేరు తెరపైకి రాగా కేటాయించాలని దామోదర సూచించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు ఈ విషయమై ఆసక్తికరంగా మారింది.

తొలిసారిగా..
తొలిసారిగా సంగారెడ్డి టికెట్‌ కోసం పలువురు నేతలు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అసమ్మతి గళం వినిపించి, పలుమార్లు మంత్రి కేటీఆర్‌ను కలవడంతో గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమైందనే అభిప్రాయం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల్లో వ్యక్తమైంది.

పార్టీలో చేర్చుకోవద్దని, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కే టికెట్‌ ఇవ్వాలని నియోజకవర్గానికి చెందిన గులాబీ శ్రేణులంతా సమావేశమయ్యారు. హైదరాబాద్‌ వెళ్లి మంత్రి హరీశ్‌రావునూ కలిశారు. తాజాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ప్రభాకర్‌కే దక్కింది. దీంతో జగ్గన్న అధికార పార్టీలోకి చేరుతున్నారనే ప్రచారానికి తెరపడింది. తాను పార్టీ మారడం లేదని, రాహుల్‌గాంధీతోనే రాజకీయ ప్రయాణం ఉంటుందని వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు నాయకులు దరఖాస్తు చేసుకోవడం పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమైంది.

రేవంత్‌ వర్గం నుంచి కూడా..
పార్టీ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొత్తిరెడ్డిపల్లికి చెందిన పొన్న శంకర్‌రెడ్డి అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను ప్రత్యేకంగా చేస్తుంటారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వర్గానికి చెందిన అనుచరుడిగా పేరుంది. ఇప్పుడు ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు.

మరో ఇద్దరు..
జిల్లా కేంద్రానికి చెందిన అడ్వొకేట్‌ ఎంఏ ముఖీం, తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) నాయకుడు తుల్జారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ముఖీం.. మనబీన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా టీజేఎస్‌ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదా విలీనమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement