● ఎస్పీ మహేశ్ బి గితే
సిరిసిల్ల: భౌతిక, లైంగికదాడులకు గురైన బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ మహేశ్ బి గితే సూచించారు. జిల్లాకేంద్రంలో ఉన్న భరోసా కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణకు పోలీస్శాఖ ప్రాధాన్యమిస్తోందన్నారు. మహిళలు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. భరోసా కేంద్రం ద్వారా సత్వర సాయం కల్పించాలన్నారు. మహిళలపై వేధింపులు, నమోదవుతున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. డీసీఆర్బీ సీఐ మొగిలి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ ఎ.శిల్ప, లీగల్ సపోర్ట్ పర్సన్ లహారిక, సపోర్ట్ పర్సన్స్ స్వభావతి, రిచా, రిసెప్షనిస్ట్ మల్లేశ్వరి ఉన్నారు.
జిల్లాకు రెండోస్థానం
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 22 నుంచి 26వరకు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఈగల్ బృందాన్ని ఎస్పీ మహేశ్ బి గితే అభినందించారు.
మెరుగైన విద్యుత్ సరఫరే లక్ష్యం
సిరిసిల్లటౌన్: జిల్లాలో మెరుగైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా టీజీఎన్పీడీసీఎల్ పనిచేస్తోందని ఎస్ఈ ఆర్.రవీందర్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో విద్యుత్ సరఫరా కోసం మొబైల్ ట్రాన్స్ఫార్మర్ను గురువారం ప్రారంభించారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో సహా అన్ని గ్రామాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఉండదన్నారు. సిరిసిల్లలోని అంబికానగర్లో నిరంతర విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను చార్జింగ్ చేశారు. డీఈలు ఎన్.అంజయ్య, జి.వెంకటరమణ, ఏడీఏలు రఘునాథ్, గంగాధర్, శ్రీనివాస్, అనిల్, శ్రీనివాస్, రాజలింగు, కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు.
ఇందిరమ్మ కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్ల: జిల్లాలోని వెనకబడిన తరగతుల(బీసీ) మహిళాలకు స్వయం ఉపాధి కల్పించి, ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు వందశాతం సబ్సిడీపై ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సౌజన్య గురువారం తెలిపారు. రూ.12వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ను ఉచితంగానే అందిస్తారని, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబరు 15వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. బీసీ కులాలకు చెందిన మహిళలు అర్హులని, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. మేర కులానికి చెందిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. టైలరింగ్ నైపుణ్యం, విద్యార్హతలు ఉన్న బీసీ కులానికి చెందినవారు దరఖాస్తులు చేయాలని కోరారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేస్తే.. మున్సిపల్, మండల పరిషత్ స్థాయిలో కమిటీ పరిశీలిస్తుందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు
సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు(అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నీ) రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తుందని జిల్లా యువజన, క్రీడల అధికారి ఆజ్మీరా రాందాస్ గురువారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్టు 31వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ పోటీలకు అర్హులన్నారు. 19 రకాల క్రీడల్లో ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆఫీసులో ఆగస్ట్ 31వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని, ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి టీఏ, డీఏ ఇవ్వరని రాందాస్ స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు 80747 92123, 75692 07411 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.


