వర్షాలకు పొంగిపారుతున్న వాగులు నిలిచిపోతున్న రాకపోకలు కల్వర్టులు దాటుతూ ప్రమాదాలు
ఏళ్లుగా ఇవే తిప్పలు జిల్లాలో 62 లోలెవల్ కల్వర్టులు, కాజువేలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా ప్రజలను లోలెవల్ వంతెన కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. వ్యవసాయ పనులపై, ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి వెళ్లే క్రమంలో దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిపై హై లెవల్ వంతెనలు నిర్మించాలని స్థానికుల నుంచి విన్నపాలు వస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఏటా వర్షాకాలంలో లోలెవల్ వంతెన వద్ద వరద కష్టాలు తీరడం లేదు.
● జిల్లా వ్యాప్తంగా 256 గ్రామపంచాయతీల పరి ధిలో 62 ప్రాంతాల్లో లోలెవల్ కల్వర్టులు ఉన్నా యి. చాలా చోట్ల ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
● ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, నారాయణపూర్, సింగారం, కోరుట్లపేట, దుమాల, అక్కపల్లి, రాచర్లబొప్పాపూర్ గ్రామాల శివారులో లోలెవల్ కల్వర్టులు ఉన్నాయి.
● గంభీరావుపేట మండలం లింగన్నపేట, నర్మాల, మల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలం ఆవునూర్, రామలక్ష్మణపల్లి, దుబ్బాక రోడ్డులో ముస్తాబాద్ శివారులో, ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, ఒగుళాపూర్, ఇల్లంతకుంట మండల కేంద్రం, నర్సింహులపల్లి వద్ద వాగులు కల్వర్టులపై నుంచి పొంగి ప్రవహిస్తున్నాయి.
● వేములవాడ నుంచి కొండగట్టు వెళ్లే రోడ్డు, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, బావుసాయిపేట, వట్టిమల్ల వద్ద వాగులు పారుతున్నాయి.
● వీర్నపల్లి మండలం గర్జనపల్లి– వన్పల్లి మధ్య, రంగంపేట–అడవిపదిర, అడవిపదిర గ్రామంలోకి వెళ్లే రోడ్డు పై నుంచి వరద ప్రవహిస్తుంది.
ఇది ఎల్లారెడ్డిపేట మండలం పదిర, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి మధ్య మానేరువాగుపై ఉన్న లోలెవల్ కల్వర్టు. ఇటీవల కురిసిన వర్షానికి మానేరువాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఈ లోలెవల్ వంతెన పై నుంచి వరద పారుతుంది. ప్రమాదకరంగా వరద పారుతున్న వాగుకు అటువైపు గ్రామాలకు వెళ్లే వారు సాహసం చేస్తూ దాటుతున్నారు. ఈక్రమంలో గత వారం రోజుల్లో రెండు ఘటనల్లో కొట్టుకుపోయిన నలుగురు యువకులు, ఓ కుటుంబాన్ని గ్రామస్తులు తాళ్లతో రక్షించారు. అయినా ఒక బైక్ కొట్టుకుపోయింది. ఇంత జరుగుతున్నా ప్రజలు మాత్రం ప్రమాదకరంగానే దాటుతున్నారు.


