వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులతోపాటు నిత్యాన్నదాన ట్రస్టుకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఈవో రమాదేవి కోరారు. భీమేశ్వరాయంలో డొనేషన్ కౌంటర్, ప్రొటోకాల్ కార్యాలయం పక్కన ప్రచారశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాశ్వత పూజల డొనేషన్ కౌంటర్లను బుధవారం ఈఈ రాజేశ్, డీఈవో నవీన్లతో కలిసి ప్రారంభించారు. కౌంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్ చెరో రూ.1,116 విరాళాన్ని అందజేశారు.
నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యం
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డీఈవో శ్రీరాం మొండయ్య పేర్కొన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో తరగతి గది బోధనను బుధవారం పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
అర్హులకు టీకాలు వేయాలి
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని ధర్మారం సబ్సెంటర్లో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ బుధవారం పరిశీలించారు. కోనరావుపేట పీహెచ్సీలో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్(యూఐపీ)లో భాగంగా చిన్నారులకు టీకాలు వేశారు. ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అధికారి సంపత్కుమార్, వీసీసీఎం నవీన తదితరులు పాల్గొన్నారు.
‘రోడ్డు ఆక్రమణలపై చర్యలు తీసుకోండి’
వేములవాడ: మున్సిపల్ రోడ్డుపై అక్రమంగా షెడ్లు నిర్మించి, అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు కొండ్లెపు ముత్యం, వంగల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్ బుధవారం కమిషనర్ లోకేశ్కు ఫిర్యాదు చేశారు. గాయత్రి బ్యాంక్ వీధి, నటరాజ్ విగ్రహం వద్ద రోడ్డుపై కొందరు షెడ్లు నిర్మించుకున్నారన్నారు. బహిరంగ వేలం ద్వారా షెడ్లు కేటాయిస్తే మునిసిపాలిటీకి రూ.36లక్షల ఆదాయం వస్తుందన్నారు.
ఫారంపాండ్ పనులు పూర్తి చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా వ్యాప్తంగా ఫారంపాండ్ పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ సూచించారు. మండలంలోని వెంకటాపూర్లో కమ్యూనిటీ ఫారంపాండ్ పనులను బుధవారం పరిశీలించారు. ఆసక్తి ఉన్న చిన్న, సన్నకారు రైతులు తమ భూముల్లో నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపీడీవో సత్తయ్య, ఏపీవో కొమురయ్య పాల్గొన్నారు.
ఇజ్రాయేల్లో ఉపాధి అవకాశాలు
సిరిసిల్ల: జిల్లాలోని యువతీ, యువకులకు ఇజ్రాయేల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి ముప్పిడి రజనీకిరణ్ బుధవారం తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ లిమిటెడ్(టాంకామ్) ద్వారా సంరక్షకుడు, సంరక్షకురాలు ఉద్యోగం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. 25–45 ఏళ్ల మధ్యవయసు గల వారు ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ, డిప్లొమా ఇన్ పేషెంట్ కేర్, బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు, ఇంటర్ పూర్తి చేసి, ఆంగ్ల భాషపై నైపుణ్యం ఉన్న వారికి అవకాశం ఉందన్నారు. నెల జీతం రూ.1.86లక్షలతో రెండేళ్ల అగ్రిమెంటు ఉంటుందని వివరించారు. ఆసక్తి గల వారు 0835524946లో సంప్రదించాలని సూచించారు.


