సిరిసిల్ల అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన శక్తి పాలసీని వెనక్కు తీసుకొని, ఎస్బీటీఈటీను బలోపేతం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్కు వినతిపత్రం ఇచ్చారు. జీవో నంబర్ 97/2026లో పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పీపీపీ/ప్రైవేటీకరణకు అప్పగించే చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరారు. నాయకులు కడారి శివ, సాయిరాం, రషీద్, ముబారక్, జశ్వంత్, సాయితేజ, విజయ్, బాలాజీ, ఆదిత్య, మానస, అభిజ్ఞ పాల్గొన్నారు.


