భక్తులకు ఇబ్బంది కలగొద్దు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలే ప్రధాన ఎజెండాగా పని చేస్తున్నామని ఈవో రమాదేవి తెలిపారు. భక్తులకు మరింత ఆధునిక, పారదర్శక సేవలు అందించాలనే లక్ష్యంతో పీవోఎస్ మెషిన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మెషిన్ల వినియోగంపై గురువారం ఇండియన్ బ్యాంక్ అధికారులు ఆలయ ఉద్యోగులకు ప్రత్యేక డెమో నిర్వహించారు. వీటి ద్వారా భక్తులు డిజిటల్ చెల్లింపులు జరపొచ్చు. బుకింగ్ కౌంటర్, లడ్డూ కౌంటర్, కోడె కౌంటర్, ప్రొటోకాల్ కార్యాలయం, డొనేషన్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపు సేవలు అందుబాటులోకి తెనున్నట్లు ఈవో తెలిపారు. డీఈవో నవీన్, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఇండియన్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
లడ్డూ తయారీ కేంద్రం ఆకస్మిక తనిఖీ
భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో రమాదేవి సూచించారు. లడ్డు, పులిహోర ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. కౌంటర్లలో పారిశుధ్య పరిస్థితులు, రికార్డులను తనిఖీ చేశారు. భక్తులను ప్రసాదాల నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈఈ రాజేశ్, ఏఈవో జయకుమారి, డీఈ రామకృష్ణారావు, పర్యవేక్షకుడు రాజేందర్, పీఆర్వో పెరుక శ్రీనివాస్ ఉన్నారు.


