
సాక్షి, గుంటూరు/హైదరాబాద్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్.. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్లకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. ఏపీలో నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో అమలులో భాగంగా మరో వైఎస్సార్సీపీ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గోపీపై పలు కేసులు నమోదు చేశారు. ఏసీబీ అధికారులు హైదరాబాదులోని గచ్చిబౌలిలో గోపీని అరెస్ట్ చేశారు. లక్ష్మీ బాలాజీ క్రషర్స్ ఆరోపణల కేసులో విడదల గోపీని అరెస్ట్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో గోపీని ఏపీకి తరలించనున్నారు.
