
తాడేపల్లి : వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు(సోమవారం, జూన్ 2) వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా ఆధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు బుధవారం(జూన్ 4వ తీదీ) చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు.
దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ రేపు మండల స్థాయిలో కూడా వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ చేయాలి. ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం చేయాలి. ఎక్కడైనా అడ్డంకులు కల్పిస్తే న్యాయస్థానాల ద్వారా అధిగమిద్దాం. నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రం అందజేయాలి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడైన ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ మీడియాతో మాట్లాడి వివరించాలి. ఎలాంటి శషబిషలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో ఘర్షణ పడటానికి కాదు.. ప్రజల ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టాలి’ అని సజ్జల పేర్కొన్నారు.