మహిళను వివస్త్రను చేసిన ఘటన అమానుషం
దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పోలీసులు
తమ పార్టీ నేత అని కేసు పెట్టనివ్వని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి
సెటిల్మెంట్ చేయాలని చూడటం మరింత దారుణం
వైఎస్సార్ సీపీ మహిళా
ప్రజాప్రతినిధులు, నేతలు మండిపాటు
పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో బాధితురాలికి భరోసా
గుంటూరు ఎడ్యుకేషన్: సభ్య సమాజం తలదించుకునేలా గుంటూరు నగరంలో చోటుచేసుకున్న ఘటనపై వైఎస్సార్ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు, నేతలు మండిపడ్డారు. గుంటూరు కేవీపీ కాలనీ మెయిన్రోడ్డులోని కృష్ణబాబు కాలనీలో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి ఈ నెల 15వ తేదీన బోరింగ్ పంపు వద్ద నెలకొన్న వివాదంలో ఒక మహిళను వివస్త్రను చేసిన ఘటనలో బాధితురాలిని సోమవారం వారు పరామర్శించారు. బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తాము వచ్చామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకట్రెడ్డి, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ, మాజీ కార్పొటర్లు బూసి రాజలత, యక్కలూరి మారుతి కోటి లింగారెడ్డి, వంగల హేమలత, అచ్చాల వెంకటరెడ్డి, గేదెల రమేష్, కాండ్రుకుంట గురవయ్య, నాయకులు త్రివేణి, సుబ్బులు, గరిక ఝాన్సీ, పిల్లి మేరీ, స్వర్ణలత, గౌరీ, పెద్దిరెడ్డి సుధ, జగన్ కోటి, అబీద్, పోలవరపు వెంకటేశ్వర్లు, వంగల వలివీరారెడ్డి, పోకల వసంత్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనలో రాష్ట్రం బిహార్ను మించిపోయింది. అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పోలీసులు కూడా ప్రజల కోసం కాకుండా టీడీపీ నేతల కోసం పని చేస్తున్నారు. నిందితులు టీడీపీ నాయకుడు కావడంతో పోలీసులు పట్టించుకోలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఈ నేతలను కాపాడే ప్రయత్నం చేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్న గల్లా మాధవి తన నియోజకవర్గ పరిధిలో ఒక సాధారణ మహిళపై ఇంతటి దారుణం జరిగితే కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. సీసీ కెమెరా ఫుటేజీలు ఉండటం వలనే ఈ అమానుష దాడి బయటకు వచ్చింది.
– విడదల రజిని, మాజీ మంత్రి
బాధితుల ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉండటం వలనే జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. లేకుంటే టీడీపీ నేతలు, పోలీసులు అసలు కేసే లేకుండా మేనేజ్ చేసేవారు. ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కూటమి పాలనలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మహిళా కమిషన్ ఏం చేస్తోంది? ఆధారాలు ఎలా బయటకు వచ్చాయనే ఆందోళన మినహా నిందితులపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన లేదు. బాధితులకు అండగా నిలవాలనే ఆలోచన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు లేదు. ఎక్కడైనా, ఏ పార్టీలో అయినా నాయకుడు సరిగా ఉంటే దానిని అందరూ పాటిస్తారు.
– ఉప్పాల హారిక, కృష్ణా జెడ్పీ చైర్పర్సన్


