‘టీడీపీ ఆఫీస్‌లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’ | YSRCP Leader Ravindranath Reddy Comments On Chandrababu Naidu, More Details Inside | Sakshi
Sakshi News home page

‘టీడీపీ ఆఫీస్‌లో టీటీడీ రిపోర్ట్.. ఏంటీ గూడుపుఠాణి?’

Sep 29 2024 11:39 AM | Updated on Sep 29 2024 12:43 PM

Ysrcp Leader Ravindranath Reddy Comments On Chandrababu

రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. ఇది ప్రజల ప్రభుత్వం కాదంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని.. ఇది ప్రజల ప్రభుత్వం కాదంటూ వైఎస్సార్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేనిఫెస్టోలో సూపర్ సిక్స్‌ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి చేతులెత్తేశారని.. దీన్ని  కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ వంద రోజుల్లో రూ.30 వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. చేసిన అప్పులు,  ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

‘‘ప్రజలు తప్పు చేశామని బాధ పడుతున్నారు.. పాలిచ్చే ఆవును వదిలి తన్నే గేదెను తెచ్చుకున్నామని ఆవేదన పడుతున్నారు. ఓ పక్క దోపిడీ, మరో పక్క వైఎస్సార్‌సీపీ వారిపై దాడులు. వరదలు నుంచి డైవర్ట్ చేయడానికి ప్రకాశం బ్యారేజ్ బోటు అంటూ ఆరోపించారు. తీరా చూస్తే అది టీడీపీ నేతకు చెందిన బోటు. ఆ తర్వాత కాదంబరి అనే మహిళ వ్యవహారం తెచ్చారు.  కూటమి ప్రభుత్వం ఎన్నిక రాజకీయ కుట్రలు చేసినా కానీ ఇచ్చిన వాగ్దానాలను ప్రజలు మర్చిపోరు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ ప్రతిష్టను దెబ్బతెస్తున్నారు. ఇలాంటి నీచమైన పాలిటిక్స్ చేసే వారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. నెయ్యి వచ్చింది. టెస్ట్ చేసింది అంతా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చాకే టెండర్లు పిలిచారు. సరఫరా కూడా జరిగింది ఆ తర్వాతే. మార్చి 16 నుంచి మా ప్రమేయం లేదు. తిరుమల, తిరుపతిలో రెండు ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ పరీక్షలు జరుగుతాయి. వాస్తవానికి ఉన్నత పరీక్షల కోసం మైసూర్ సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపుతారు. కానీ దీన్ని గుజరాత్ ఎన్‌డీడీబీకి పంపారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం

‘‘ముందు రోజు ఈ సంస్థ ప్రతినిధులు టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. ఎన్‌డీడీబీ ప్రస్తుత చైర్మన్ మనీషా, మాజీ ఛైర్మన్ వర్షా ఇద్దరూ శ్యామలరావును కలిశారు. ఆ తర్వాతే ఈ రిపోర్ట్ వచ్చింది. గూడుపుఠాణి చేసి జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఈవో, ముఖ్యమంత్రి వేర్వేరు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. రెండు నెలల తర్వాత ఈ నివేదిక విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి..?. ఒక కీలకమైన టీటీడీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్‌లో విడుదల చేయడం ఏంటి?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

‘‘ఇవన్నీ చూస్తుంటే పెద్ద కుట్ర జరిగిందని స్పష్టమవుతుంది. హిందువులను వైఎస్‌ జగన్‌కు దూరం చేయాలని ఈ కుట్ర పన్నారు. లడ్డూనే కాదు.. ఏ ఆహార పదార్థాల్లోనైనా జంతువుల కొవ్వు కలిపితే రెండు రోజుల్లోనే దుర్వాసన వస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేవలం వైఎస్సార్‌సీపీని దెబ్బతీయాలని ఎన్డీఏ భాగస్వాములు అంతా కలిసి చేసిన కుట్ర. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.

‘‘వైఎస్‌ జగన్ దేవుని దర్శనానికి వెళ్తుంటే అడ్డుకుని, మేమెప్పుడు అడ్డుకున్నామంటూ బుకాయిస్తున్నాడు. వైఎస్సార్‌సీపీ వారికి నోటీసులు ఇచ్చి, పోలీసులతో అడ్డుకున్నారు. 30 యాక్ట్ పెట్టీ వైఎస్సార్సీపీ వారినే ఆడ్డుకుంటారా. ? ఇతర పార్టీల వారు తిరుమల చేరుకున్నా యాక్ట్ అమలు కాదా .?. నీకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకో.’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

‘‘వైఎస్‌ జగన్ ప్రధానికి లేఖ రాశారు.. సిట్టింగ్ జడ్జితో విచారణ డిమాండ్ చేశారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు.. నీకు బుద్ధి చెప్తారు. నిన్న వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు ప్రజలు నిన్న దేవాలయాల్లో చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలని పూజలు చేశారు. పవన్ కళ్యాణ్.. తన ఓనర్ స్క్రిప్ట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చి డ్రామాలు వేస్తాడు. ప్రశ్నిస్తాను అన్నాడు.. పిల్లల మిస్సింగ్ అన్నావు. డిప్యూటీ సీఎంగా నువ్వు ఎంతమందిని కాపాడావు ?. వరదల్లో కనీసం బయటకు వచ్చావా .? ఓనర్ స్క్రిప్ట్ ఇవ్వగానే బయటకు వచ్చి హంగామా చేశాడు. తాను క్రిస్టియన్ అని చెప్పి మళ్లీ సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నాడు. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement