గుంటూరులో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ | Ysrcp Holds Huge Rally In Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ

Jun 20 2026 6:31 PM | Updated on Jun 20 2026 6:59 PM

Ysrcp Holds Huge Rally In Guntur

సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన‌ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే హతమార్చుతున్నారు. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాడట. 49 రోజుల క్రితం సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు?. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, వైఎస్‌ జగన్ వారి ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం పట్టించుకోదా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.

‘‘పోలీసులు నమోదు చేసున కేసు కోర్టులో నిలబడదు. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 28న విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కాదని మొన్న హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు?. సీఐ నాగరాజును బలి చేయటానికి హడావుడిగా కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ కుమార్ చాలా స్పష్టంగా సాయికృష్ణ కేసు వివరించారు. సాయికృష్ణ హత్య సీపీ, డీజీపీకి తెలియకుండానే జరిగిందా?

..క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు కూడా నిలపడకుండా చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో పెద్దపెద్ద వారి ప్రమేయం ఉంది. 29న కోర్టులో సాయికృష్ణను హాజరు పరుస్తారా?. కనీసం బూడిద కూడా దొరక్కుండా చేశారు. నేరాంగీకారం జరిగితే తప్ప ఇది మర్డర్ కేసుగా నిలబడదు. కాపులను చంపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా?. కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.

‘‘పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణ వ్యవహారం వెనుక ఉన్న బడా బాబులు బయటకు రావాలి. సీఐ నాగరాజు పాత్ర ఒక్కటే సాయికృష్ణ కేసులో లేదు. సీబిఐ విచారణలో మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజమండ్రి ఎస్పీ విచారణలో వాస్తవాలు వెల్లడవ్వవు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement