తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనలో ఒక్క పోలీస్ కూడా కనిపించలేదని తెలిపారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని అన్నారు.
జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. జనం రాకుండా పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టారు. పోలీసులను చంద్రబాబు ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటున్నారు. గతంలో మేడరమెట్ల, రాప్తాడు, సత్తెనపల్లి పర్యటనల్లోనూ భద్రతా లోపాలు బయటపడ్డాయని తెలిపారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత ఇదేనా?
ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు!
పొగాకు రైతులు గతంలో ఎప్పుడూ చూడని కష్టాలు చూస్తున్నారని పేర్ని నాని అన్నారు. ‘‘అసలు కొనే నాథుడే లేకుండా పోయారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు ఇంజిన్ లేకుండా నడుపుతున్నారు. గత ఏడాది పరిస్థితులు చూసైనా ఈ ఏడు అయినా జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ ఏడాది కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. జగన్ పొగాకు రైతుల ఇబ్బందులపై ప్రశ్నించేందుకు వెళ్లారు.
జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న జగన్ భద్రతను హోంశాఖ నిర్లక్ష్యం వహించింది. కానీ ఆయన సభలకు జనం రాకుండా అంచెలంచెలుగా ప్రజలను అడ్డుకుంటారు. ఈ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ అన్ని దారుల్లో వస్తున్నారు. దేవరపల్లి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో జనాన్ని లోపలకి రానీయకుండా బారికేడ్లు పెట్టడానికి వందల మంది పోలీసులు ఉంటారు.
చంద్రబాబు పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకోవటం దారుణం. డీజీపీ అయినా పోలీసులను మందలించలేదు. ఈ రెండేళ్లలో భద్రతా లోపాలు అనేకసార్లు కేంద్రానికి పంపాం. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా డీజీపీ స్పందించలేదు. అనంతపురం జిల్లా లో హెలికాఫ్టర్ దగ్గర భద్రత లేక విండ్ షీల్డ్ పగిలితే పైలెట్లను వేధించారు.
గతంలో ఇలాగే చేసి ఉంటే మీరు తిరగ గలిగేవారా? ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిందని జనం మాట్లాడుకుంటున్నారు. జగన్ చేస్తుంది రాజకీయ పర్యటనలు కాదు. ప్రజల కష్టాలు చూడటానికే ఆయన వెళ్తున్నారు. సిగ్గులేకుండా బాధ్యత లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. జగన్ పర్యటనల్లో తొక్కిసలాటలు జరగాలి అని చూస్తున్నారు. జగన్ పర్యటనపై లోకేశ్ ట్వీట్ పెట్టి అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ శ్రేణులు ఒక దుకాణం పగులగొట్టి హిందూ దేవుడి ఫొటో పగులగొట్టారని ట్వీట్ చేశారు.
మరి సింహాచలం, తిరుపతి, శ్రీకాకుళం ఘటనల్లో పలువురు మృతి చెందారు.. మిమ్మల్ని ఎవరు క్షమిస్తారు? మీ ఆత్రమే తప్ప.. ఈ ప్రభుత్వం బతికేది లేదు. మీ ప్రభుత్వం పోవాలని టీడీపీ కార్యకర్తలే పూజలు చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో కమ్మలు, కాపులు కూడా ఏడుస్తున్నారు. ఏపీలో అవినీతి చేయటానికి దేన్నీ వదలటం లేదు. దుకాణదారురాలు లక్ష్మీ వైసీపీ అభిమాని కాబట్టి మీ పప్పులు ఉడకలేదు’’ అని తెలిపారు.
విజయ్కు జనాన్ని దూరం చేయగలిగారా?
తమిళనాడులో విజయ్ సభలో ఏదో చేద్దామని ఆయన ప్రత్యర్థులు చూశారని అక్కడ ఏం సాధించారని పేర్ని నాని ప్రశ్నించారు. ‘‘విజయ్కు జనాన్ని దూరం చేయగలిగారా? సీఎం కాకుండా ఆపారా ? మీకు కూడా అదే గతి రాదా? సత్తెనపల్లి జగన్ పర్యటనలో కూడా ఇదే తరహాలో చేశారు. రెండేళ్లలో ఓటు వేసిన ప్రభుత్వాన్ని కూల్చే అధికారం లేదు కాబట్టి ప్రజలు మిన్నకుండిపోయారు. పోలీసులను జగన్ భద్రతకు వహించాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ మావిగన్ దెబ్బకి అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిపి ఉంచుతాం అంటున్నారు’’ అని తెలిపారు.


