
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి.
మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు
మా హయాం.. రైతులకు స్వర్ణయుగం
మా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.
కూటమి పాలనలో అధ్వానం
కూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు.
చంద్రబాబుకు జగన్ హెచ్చరిక
వ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు.