Tobacco market
-
మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు. -
పొగాకు మార్కెట్ పతనం
కొండపి: నిన్నమొన్నటి వరకూ పర్వాలేదు అనుకున్న పొగాకు మార్కెట్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్క రోజులోనే కొండపి వేలం కేంద్రంలో కేజీకి రూ.10 పైగా ధర తగ్గింది. దీంతో రైతులు ఆందోళనకు దిగి వేలాన్ని అడ్డుకున్నారు. స్థానిక పొగాకు వేలంకేంద్ర అధికారి మురళీధర్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటగా 48 బేళ్లు కొనుగోలు చేశాక సరైన ధర రాలేదని పచ్చవ, కామేపల్లి గ్రామాలకు చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాన్ని అపాలని మురళీధర్ను కోరారు. దీంతో వేలాన్ని ఆపిన మురళీధర్ వ్యాపారులు, రైతులతో మాట్లాడి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. మరో ఆరు బేళ్లు కొనుగోలు చేసిన తరువాత ధరల విషయంలో మార్పు రాలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అర్ధగంట పాటు అక్కడే రైతులు, వ్యాపారులు, అధికారుల మధ్య సంవాదం చోటుచేసుకుంది. శని, సోమవారాల్లో 80 శాతానికి పైగా నంబర్ పొగాకును క్వింటా రూ.11,500 నుంచి రూ.11,800 వరకు కొనుగోలు చేయగా, అదే రకం పొగాకును రెండు రోజులు తరువాత రూ.10,500 నుంచి రూ.11,000లోపే కొనుగోలు చేయటం ఏమిటని రైతులు ప్రశ్నించారు. వేలంకేంద్రం రైతు నాయకుడు బొడ్డపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఒక్కరోజులోనే వెయ్యి రూపాయలకు పైగా మార్కెట్ దిగకోస్తే ఎట్లా అని అధికారులను నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్ మురళీ బ్రహ్మయ్యపైకి ఆవేశంగా వచ్చారు. దీంతో అక్కడే ఉన్న రైతులు బోర్డు అధికారి దుందుడుకు చర్యకు నిరసనగా ఆర్అండ్బీ రహదారిపై బైఠాయించారు. రైతు నాయకుడు బ్రహ్మయ్యపైకి క్షేత్రసహాయకుడు రావటం సరికాదని, వ్యాపారులు మాయాజాలంతో ధరలు తగ్గించి కొనటం అన్యాయం అని నినదించారు. అర్ధగంటకు పైగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలను అక్కడే ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులు, బోర్డు అధికారులతో మాట్లాడి సంయమనంపాటించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో రైతులు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు ధరల విషయంపై వేలం కేంద్రానికి వచ్చి ఆరా తీశారు. రైతులకు న్యాయం చేసేలా చూడాలని వేలం కేంద్రం అధికారులను కోరారు. -
మరింత తగ్గిన వర్జీనియా ధర
దేవరపల్లి, న్యూస్లైన్ : వర్జీనియా పొగాకు ధర రోజురోజుకీ పతనమవుతోంది. రోజుకు కిలోకు సగటు ధర రూ. 5 నుంచి రూ.6 తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గరిష్ట ధర కిలోకు రూ.166 నుంచి 168 ఇస్తున్నప్పటికి అతితక్కువ బేళ్లకు మాత్రమే ఈ ధర లభిస్తోంది. ఈ నెల 19న కిలో గరిష్ట ధర రూ.177 పలకగా, 21వ తేదీన రూ.165లకు పడిపోయింది. గురువారం మార్కెట్లో రూ.159 నుంచి రూ.168 గరిష్ట ధర లభించింది. అయితే 90 శాతం బేళ్లను రూ.162 నుంచి రూ.164కే కొనుగోలు చేశారు. శుక్రవారం ఈ ధర మరింత తగ్గటంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గురువారం కంటే శుక్రవారం మార్కెట్లో సగటు ధర కిలోకు రూ.5 తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐదు వేలం కేంద్రాల్లో రోజుకు సుమారు 5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేస్తున్నారు. తగ్గిన ధరను బట్టి రోజుకు సుమారు రూ.15 నుంచి రూ.18 లక్షలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. గత రెండు రోజుల నుంచి కిలోకు రూ.10 సగటు ధర తగ్గిందంటున్నారు. లోగ్రేడు పొగాకు ధర రూ.130 నుంచి రూ.90కు చేరుకోగా, మాడు గ్రేడు కొనేనాధుడు లేడని రైతులు వాపోతున్నారు. వారం రోజుల్లో పొగాకు మార్కెట్ పతనం కావటంతో రైతులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మే 15 తర్వాత మార్కెట్ పుంజుకుంటుందని రైతులతో పాటు అధికారులు భావించారు. అయితే రోజురోజుకు తగ్గటంతో రైతులు అమోమయానికి గురవుతున్నారు. మున్ముందు మార్కెట్ ఎలా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు. పొగాకు కొనుగోలుదారులకు విదేశీ ఎగుమతి ఆర్డర్లు ఇంతవరకు ఖరారు కాకపోవటం వల్ల మార్కెట్ ఒడుదుడుకుల్లో ఉందని అధికారులు అంటున్నారు. ఇందువల్లే కొనుగోలుదారులు పొగాకు కొనుగోలుకు మక్కువ చూపటంలేదని చెబుతున్నారని, ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ పరిస్థితి అంతుచిక్కటంలేదని దేవరపల్లి వేలం నిర్వహణాధికారి ఎస్వీవీఎస్ మూర్తి తెలిపారు. శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రానికి 907 బేళ్లును రైతులు అమ్మకానికి తీసుకురాగా 650 బేళ్లు అమ్ముడు పోయాయి.