
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం వేదికగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం త్వరలో ఓ అప్లికేషన్(యాప్) తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.
సోమవారం వైఎస్సార్సీపీ పీఏసీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ తరఫున త్వరలో యాప్ విడుదల చేయబోతున్నాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్లో నమోదు చేయొచ్చు. ఫలానా వ్యక్తి లేదంటే ఫలానా అధికారి అన్యాయంగా ఇబ్బంది పెడితే ఆ వివరాలు ఎంట్రీ చేయాలి. దానికి తగిన ఆధారాలను కూడా జత చేయొచ్చు(అప్లోడ్). అటుపై.. ఆ ఫిర్యాదు ఆటోమేటిక్గా వైఎస్సార్సీపీ డిజిటల్ సర్వర్లోకి వచ్చేస్తుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన ఉంటుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారాయన. చంద్రబాబు ఏదైతే విత్తారో.. అదే చెట్టవుతుంది. అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
