ఇక రోడ్లూ.. ప్రైవేటుకే! | Visakhapatnam Roads To Be Privatized Under PPP Model, Raising Concerns Over Public Funds And Future City Development | Sakshi
Sakshi News home page

ఇక రోడ్లూ.. ప్రైవేటుకే!

Feb 11 2026 5:49 AM | Updated on Feb 11 2026 11:40 AM

Roads project to benefit private company

చంద్రబాబు ప్రభుత్వంలో పీక్స్‌కు చేరిన ‘పీపీపీ’ పిచ్చి 

విశాఖలో 88.35 కి.మీ రోడ్లను పీపీపీలో అప్పగింతకు నిర్ణయం

బిడ్డర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం 

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.306.95 కోట్లు 

జీవీఎంసీ వాటా 40 శాతం.. ప్రైవేటు వాటా 60 శాతం 

ప్రైవేటు వాటా ఖర్చును వడ్డీతో కలిపి పదేళ్లలో జీవీఎంసీ చెల్లించేలా టెండర్లు 

రోడ్లు పూర్తయిన తర్వాత పదేళ్లపాటు నిర్వహణ 

ఈ రోడ్లపై వచ్చే ప్రకటనల ఆదాయం కూడా ప్రైవేటుకే.. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ‘పీపీపీ’ పిచ్చి ముదురుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకున్న బాబు సర్కారు.. ఇపుడు విశాఖ రహదారులను సైతం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ‘నగర రోడ్ల అభివృద్ధి కార్యక్రమం’ పేరుతో కావాల్సిన వారికి జీవీఎంసీ ఖజానాను దోచి పెట్టాలని నిర్ణయించింది. 

విశాఖ వాసులపై ‘హైబ్రిడ్‌’ భారం మోపుతూ.. నగరంలోని 88.35 కిలోమీటర్ల మేర 53 రహదారులను పబ్లిక్, ప్రైవేట్‌ పార్టనర్‌íÙప్‌(పీపీపీ) కింద ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపడుతున్న దీని అంచనా వ్యయం అక్షరాలా రూ.306.95 కోట్లు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ గతేడాది డిసెంబర్‌ 31న బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బిడ్‌ దాఖలు గడువు ఈనెల 12వ తేదీతో ముగుస్తుంది. 

జీవీఎంసీ ఖజానా లూటీ 
ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రాజెక్టు విధి విధానాలను రూపొందించడం గమనార్హం. జీవీఎంసీయే మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని భరిస్తూ.. ప్రైవేటుకు మాత్రం లాభాలు కట్టబెట్టేలా టెండర్‌కు రూపకల్పన చేయడం విశేషం. మూడు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టును 40:60 వాటా ప్రకారం చేపట్టనున్నారు. రోడ్ల నిర్మాణ సమయంలో అయ్యే ఖర్చులో 40 శాతం మొత్తాన్ని జీవీఎంసీ ఐదు విడతలుగా ప్రైవేటు సంస్థకు చెల్లిస్తుంది. 

మిగిలిన 60 శాతం పెట్టుబడిని ప్రైవేటు సంస్థ తన సొంత నిధులు లేదా బ్యాంక్‌ రుణాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థ పెట్టిన 60శాతం పెట్టుబడిని.. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత జీవీఎంసీ 10 ఏళ్ల కాలపరిమితిలో 20 సమాన వాయిదాలలో తిరిగి (బ్యాంక్‌ రుణాలపై విధించే కనీస వడ్డీ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)తో పాటు 1.25 శాతంతో) చెల్లించేలా ప్రతిపాదించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.  

పెట్టుబడి లేని ప్రైవేటు వ్యాపారం 
ఇలా ఇవ్వడమంటే కాంట్రాక్టు సంస్థకు పైసా పెట్టుబడి లేని వ్యాపారమే అవుతుంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ వ్యయం కంటే నిర్వహణ, ఇతర రుసుముల పేరిట కేటాయించిన నిధులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మొత్తం రూ.306.95 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో.. రోడ్ల నిర్మాణానికి కేవలం రూ. 168.03 కోట్లు మాత్రమే కేటాయించారు. మిగిలిన మొత్తంలో 10 ఏళ్ల నిర్వహణ కోసం రూ.86.20 కోట్లు, ఇతర పన్నులు, ప్రాజెక్టు నిబంధనల కోసం ఏకంగా రూ.52.71 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

అంతేకాకుండా, ఎంపికైన కాంట్రాక్ట్‌ సంస్థకు ప్రాజెక్టు వ్యయంలో 1.25 శాతం (ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారీ వ్యయం చూస్తుంటే.. సాధారణ రోడ్ల మరమ్మతు పనులను కూడా అత్యంత ఖరీదైన ప్రాజెక్టులుగా మార్చి నగరపాలక సంస్థ ఖజానాను ఖాళీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ వచ్చే 10 ఏళ్ల పాటు భారీ మొత్తంలో వడ్డీతో కూడిన వాయిదాలు చెల్లించాల్సి రావడం భవిష్యత్తులో నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  

కాంట్రాక్ట్‌ సంస్థకు కాసుల వర్షమే 
ఈ ప్రాజెక్టు దక్కించుకునే కాంట్రాక్ట్‌ సంస్థకు కాసుల వర్షం కురుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాంట్రాక్టర్‌ పెట్టే 60 శాతం పెట్టుబడి ఖర్చును కూడా బ్యాంక్‌ వడ్డీతో పాటు అదనంగా మరో 1.25 శాతం కలిపి జీవీఎంసీ తిరిగి చెల్లిస్తుంది. రోడ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థ వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అయ్యే ఖర్చును కూడా జీవీఎంసీ విడిగా వాయిదాలతో సంబంధం లేకుండా చెల్లిస్తుంది. 

ఈ ప్రాజెక్టుకు పెట్టిన పెట్టుబడితోపాటు ఆ రోడ్ల వెంట వాణిజ్య ప్రకటనల లబ్ధిని కాంట్రాక్టర్‌కు కట్టబెడుతున్నారు. రోడ్డు మధ్యలో ఉండే మీడియన్లు, వీధి దీపాలు, బస్టాపులు, స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయాన్ని సదరు కాంట్రాక్టు సంస్థే దక్కించుకుంటుంది. అంతేకాకుండా, రోడ్డు కటింగ్‌ పర్మి షన్ల ద్వారా వచ్చే ఫీజులు కూడా ఆ సంస్థకే చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. 

అంటే.. ఒకవైపు ప్రజల పన్నుల రూపంలో రూ.కోట్లు ఆన్యుటీ చెల్లిస్తూనే.. మరోవైపు నగరంలోని విలువైన ప్రకటనల ఆదాయాన్ని కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం గమనార్హం. ఇప్పటికే 2025 డిసెంబర్‌ 31న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన జీవీఎంసీ అధికారులు జనవరి 20వ తేదీన ప్రీ బిడ్‌ సమావేశం కూడా నిర్వహించారు. బిడ్లను సమర్పించేందుకు ఫిబ్రవరి 12వ తేదీ వరకూ గడువు విధించడంతో పాటు ఫిబ్రవరి 27న ప్రైస్‌ బిడ్‌ను తెరవనున్నట్టు కూడా ప్రకటించారు. 

అనంతరం ఒప్పందం చేసుకున్న తర్వాత 12 నెలల్లోగా రోడ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ రోడ్లను సదరు కాంట్రాక్టు సంస్థలే 10 ఏళ్లపాటు నిర్వహించనున్నారు. తద్వారా ఈ రోడ్లపై జీవీఎంసీ నుంచి పూర్తిస్థాయిలో ప్రైవేటు చేతుల్లోకి పోనున్నాయన్నమాట. అంతేకాకుండా పీపీపీ కింద గుర్తించిన రోడ్లన్నీ నగరంలో కీలకమైన ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం. ఈ రోడ్లపై వచ్చే ప్రకటనల ద్వారా ప్రస్తుతం జీవీఎంసీ ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం మొత్తం తాజా నిర్ణయంతో ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లడం వల్ల జీవీఎంసీ గుల్ల అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పీపీపీ కింద గుర్తించిన రోడ్లు (జోన్ల వారీగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement