
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వమని, హింసాత్మక ప్రభుత్వమని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రజలు.. మమతా బెనర్జీ ప్రభుత్వం అరాచకాలపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ప్రజల భావనగా ఉందని మోదీ తెలిపారు.
దీనికి సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో జవాబిచ్చారు. తాను ప్రధాని మోదీ తరహాలో వ్యాఖ్యానించలేనంటూనే వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అనేది తేలుతుందని మోదీకి సవాల్ విసిరారు. మోదీ వ్యాఖ్యలపై కౌంటర్ రిప్లై ఇచ్చిన మమతా.. ‘ ఎన్నికలు రానివ్వండి. చూద్దాం.. ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది. ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో చూద్దాం. మా వెంట, మా పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లో చూస్కుందాం’ అని మోదీకి మమతా సవాల్ విసిరారు.
ఈరోజు(గురువారం) ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. పశ్చిమ బెంగాల్ ఎక్కడ చూసినా అవినీతి, అల్లర్లు, హింస ఇవే కనిపిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.