కేంద్ర మంత్రికి నిరసన సెగ! నల్లజెండాలతో ‘గో బ్యాక్‌’ నినాదాలు | Union Minister Giriraj Singh Shown Black Flags By BJP Workers | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రికి నిరసన సెగ! నల్లజెండాలతో ‘గో బ్యాక్‌’ నినాదాలు

Mar 10 2024 4:47 PM | Updated on Mar 10 2024 5:13 PM

Union Minister Giriraj Singh Shown Black Flags By BJP Workers - Sakshi

బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది. బిహార్‌లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. బచ్వాడాలో ఒక కార్యక్రమానికి వెళుతుండగా సొంత పార్టీ కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు.

గిరిరాజ్ సింగ్ ఇటీవల తన బెగుసరాయ్‌ నియోజకవర్గంలో యాక్టివ్‌ అయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు నిరంతరం చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

ఆదివారం బరౌని డెయిరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని బచ్వాడలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎన్‌హెచ్‌-28లోని రాణి గ్రామ సమీపంలో సొంత పార్టీ కార్యకర్తలే కేంద్ర మంత్రి గిరిరాజ్‌​ సింగ్‌కు నల్లజెండాలు చూపించారు. కాన్వాయ్‌ను చుట్టుముట్టిన వారు, బీజేపీ జెండాలతో పాటు నల్ల జెండాలను పట్టుకుని, ఆయన వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గిరిరాజ్ సింగ్ కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నల్లజెండాలు చూపుతున్న వారిని చెదరగొట్టి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పెప్సీ ప్లాంట్‌లో బెగుసరాయ్‌ వాసులెవరికీ ఉపాధి కల్పించలేదని నిరసనకారులు చెబుతున్నారు. ఆయనకు డబ్బులిచ్చినవారికి మాత్రమే ఉపాధి కల్పించారని ఆరోపించారు. అయితే తమ కార్యకర్తలు కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకే వచ్చారని బీజేపీ చెబుతోంది. నల్ల జెండాలు ప్రదర్శించినవారు సీపీఐ మద్దతుదారులని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement