‘మీరైనా ఉండాలి.. నేనైనా ఉండాలి’.. ఫడ్నవిస్‌కు ఉద్ధవ్‌ వార్నింగ్‌ | Uddhav Thackeray warning to Devendra Fadnavis in Mumbai | Sakshi
Sakshi News home page

‘మీరైనా ఉండాలి.. నేనైనా ఉండాలి’.. ఫడ్నవిస్‌కు ఉద్ధవ్‌ వార్నింగ్‌

Aug 1 2024 9:54 AM | Updated on Aug 1 2024 10:18 AM

Uddhav Thackeray warning to Devendra Fadnavis in Mumbai

ముంబై: ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో శివసేన (యూబీటీ) చీఫ్‌​ ఉద్దవ్‌ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆయన ఛాలెంజ్‌ విసిరారు. మీరైనా  ఉండాలి..  లేదా నేనైనా ఉండాలని అన్నారు.  ముంబైలో పార్టీ కార్యకర్తలు  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాం. మన పార్టీ చీలిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పార్టీ నేతలు టార్గెట్‌ చేయబడ్డారు. మనపై అధికారం, డబ్బుతో అణగదొక్కాలని చూశారు. మనల్ని జైల్లో వేయాలని కూడా ప్రయత్నించారు. ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొని.. గెలిచి చూపించాం. నన్ను, ఆదిత్య ఠాక్రేను జైలుకు పంపాలని కుట్ర చేశారు. మీరు(దేవేంద్ర ఫడ్నవిస్‌) సూటిగా వ్యవహరిస్తే మేము సూటిగా ఉంటాం. కాదని మరోలా ప్రవర్తిస్తే.. మేం  కూడా దీటుగా సమాధానం చెబుతాం. అయితే  మీరైనా ఉండాలి లేదా నేనైనా  ఉండాలి.

.. నేను మున్సిపల్‌ కార్పొరేటర్‌గా ఎన్నిక కాలేదు.  నేను డైరెక్టుగా ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాను.సాధ్యమైనంతవరకు పనులు చేశా.  ఇవే మీకు చివరి అసెంబ్లీ ఎన్నికల అవుతాయి. బీజేపీ మన పార్టీని చీల్చారు. కానీ శివసేన(యూబీటీ) తుప్పపట్టిన కత్తికాదు. పదునైన ఆయుధం. మేము మహారాష్ట్ర, ముంబైని రక్షించడానికి పోరాడుతాం. బీజేపీ తగిన సమాధానం ఇస్తాం’’ అని అన్నారు. 

ఇక.. ఉద్ధవ్  వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. ఫడ్నవీస్ రాజకీయాలను ముగించే ముందు థాక్రే వంద జన్మలు  ఎత్తాలని కౌంటర్‌ ఇచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement