పిఠాపురంలో పవన్‌ పరిస్థితి ఏమిటో? | Special Story On TDP Supporters Protest Against Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో పవన్‌ పరిస్థితి ఏమిటో?

Mar 17 2024 6:27 PM | Updated on Mar 17 2024 6:43 PM

Special Story On TDP Supporters Protest Against Pawan Kalyan - Sakshi

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేసే నియోజకవర్గం ప్రకటించారు. రాష్ట్రం అంతా దుర్భిణీ వేసి వెతికి చివరికి పిఠాపురం ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నా గెలుపుపై గ్యారెంటీ కనిపించడంలేదు. పిఠాపురం అనుకున్నప్పటినుంచీ అక్కడ నాన్ లోకల్ వివాదం మొదలైంది. మాకు పిలిస్తే పలికే ఎమ్మెల్యే కావాలంటూ అక్కడ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నియోజకవర్గానికి గెస్ట్‌గా వచ్చే నేత వద్దంటూ అక్కడివారు నినదిస్తున్నారు. మరి అక్కడ పవన్‌ పరిస్థితి ఏంటో చూద్దాం.

గత ఎన్నికల్లో తనను ఓడించినందుకు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోని ప్రజల్ని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నిందించారు. ఒక్క చోట కూడా గెలిపించకపోవడం వల్లే తన పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని వాపోయారు. పదేళ్ళుగా చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్న పవన్‌కల్యాణ్ ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

వైఎస్ జగన్‌ ఫోబియా పవన్‌ను వెంటాడుతోంది. అందుకే నియోజకవర్గం ఎంచుకోవడానికి ఇంత ఆలస్యం చేశారు. తనకు కులం లేదని చెప్పుకుంటూనే నిరంతరం కాపుల జపం చేస్తున్నారు. అందుకే కాపులు మెజారిటీగా  ఉండే పలు నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుకున్నా అక్కడి పరిస్థితులు సానుకూలంగా లేవని అర్థమైంది. దీంతో కాకినాడ జిల్లా పిఠాపురం అయితే బెటర్‌ అని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న టీడీపీ నేత తమ అనుచరులతో ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు జనసేనలో కలకలం రేపాయి.

లోకల్ ..నాన్ లోకల్ అనే అర్ధం వచ్చేలా పిఠాపురం నియోజకవర్గంలో దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. పిలిస్తే పలికేవాడే మాకు కావాలంటూ వెలిసిన ఆ ఫ్లెక్సీలు పవన్‌ను అక్కడ పోటీ చేయవద్దనే ఏర్పాటు చేసి ఉంటారని..అది కూడా టీడీపీ ఆశావహుడు వర్మ ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడ ఎప్పటినుంచో పనిచేసుకుంటున్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ మాత్రం జనసేనకు ఇవ్వడానికి వీల్లేదని గట్టిగా పట్టుపడుతున్నారు. 
చదవండి: పవన్‌కు షాక్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు 

పొత్తులో భాగంగా పిఠాపురం జనసేన ఖాతాలో చేరుతుందనే ప్రచారంతో టీడీపీ శిబిరంలో అసమ్మతి రాజుకుంది. సీటు జనసేనకు కేటాయిస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమని కొద్ది రోజుల క్రిందట టీడీపీ నేత వర్మ అనుచురులు చంద్రబాబుకు హెచ్చరికలు పంపారు. ఆ మధ్య వర్మ నిర్వహించిన పలు సమావేశాల్లో.. పిలిస్తే పలికే వాడికే ఓటు వేయ్యాలి కానీ.. ఎక్కడో దూరంగా ఉంటూ..అప్పుడప్పుడు వచ్చేవాళ్ళకు ఓటు వేసి సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే పిలిస్తే పలికే వ్యక్తి వర్మ.. లోకల్ వ్యక్తి వర్మ అని పలువురు బాహటంగానే ప్రచారాలు మొదలు పెట్టారు. దీంతో పిఠాపురంలో వెలసిన ప్లెక్సీలు టీడీపీ పనే అని అందరు చర్చించుకుంటున్నారు. పిఠాపురానికి నాన్ లోకల్ అయిన పవన్ కళ్యాణ్‌కు అడ్డుకట్ట వేసేలా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. పవన్‌ పోటీ చేస్తే మాత్రం సహకరించరాదని టీడీపీ నేత వర్మ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. 

అయితే ఇప్పటికే పిఠాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా వంగా గీత క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్‌ ఎంపీ అయిన గీత గతంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా బాద్యతలు నిర్వహించిన వంగా గీతకు నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో పవన్‌ తన సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గం అనుకుంటున్నప్పటికీ అక్కడ అంతే బలంగా ఉన్న వంగా గీతను ఎదుర్కొని విజయం సాధించడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement