25 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
పామిడి: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. సీఐ శివశంకర్ నాయక్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్, 35 మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అలాగే, ఐషర్ వాహనం జిమ్ పరికరాలతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతోంది. పొగరూరు గ్రామం వద్ద ఐషర్ వాహనం అదుపుతప్పి నీలూరు పుల్లేటి వంక బ్రిడ్జి ప్రారంభంలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా తిరిగింది.
దాని వెనకే వేగంగా వస్తోన్న ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలూ బ్రిడ్జిపై నుంచి కిందకు దూసుకువెళ్లి బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు ఎడమకాలు విరగ్గా, ఐషర్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులోని 25 మంది గాయాలపాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో అనంతపురం నుంచి బెంగళూరు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


