ఆపై తానూ ఆత్మహత్య
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నతనంలోనే పోలియో ఉన్న కమ్మిడి లక్ష్మణరావు (32)కు మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఆ గ్రామంలోనే మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ నడుపుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగనన్న కాలనీలో ఉంటున్న లక్ష్మణరావు అన్న కమ్మిడి రాంబాబు ఆదివారం లక్ష్మణరావుకు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తమ్ముడి ఇంటికి వచ్చి చూసేసరికి భార్యాభర్తలిద్దరూ విగతజీవులై కనిపించారు.
రెండు చేతుల నుంచి రక్తం కారుతూ శ్యామల మృతి చెందగా, పక్కనే ఉరివేసుకుని లక్ష్మణరావు మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, వారి మరణానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. భార్యను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ మృతుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. లక్ష్మణరావు తల్లితో కలిసి ఉంటున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె మృతి చెందింది. శ్యామలతో వివాహమైన తరువాత కూడా తల్లిని మర్చిపోలేకపోయాడు. దీంతో ‘అమ్మ నీవు లేని ఈ జీవితం నాకు వద్దు, నీ వద్దకే వచ్చేస్తాను, నేను చనిపోతే శ్యామల ఒంటరిదైపోతుంది. కనుక ముందుగా ఆమెను చంపి, నేను చనిపోతాను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు.


