అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు | Public meeting held at Ichhapuram in Srikakulam district | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు

Oct 27 2023 5:39 AM | Updated on Oct 27 2023 5:39 AM

Public meeting held at Ichhapuram in Srikakulam district - Sakshi

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీఎం జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు అగ్రస్థానమిచ్చి, ఆ వర్గా లకు రాజకీయ, సామాజిక సాధికారత సాధించిన సీఎం వైఎస్‌ జగన్‌ అని తెలిపారు. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా గురు వారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి రహిత, పారదర్శకమైన సుపరిపాలన అందిస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పాలన సాగించామని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదా రుల్లో వైఎస్సార్‌సీపీ వారితో పాటు అన్ని పార్టీల వారూ ఉన్నారని తెలిపారు. పేదలకు ఇస్తున్న స్థలం దేనికీ పనికిరాదని చంద్రబాబు విమర్శించారని, కానీ తామిచ్చిన స్థలమే పేదలకు పెద్ద ఆస్తి అయిందని వివరించారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారన్నారు. 2024కి వైజాగ్‌ రాజధానిగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

ఉద్దానంలో ఎంతో మంది యాక్టర్లు తిరిగినా ఏమీ చేయలేదని, వైఎస్‌ జగన్‌ మాత్రమే కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా నిలి చారని చెప్పారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలను అవమానించారని తెలిపారు. పేదలకు మేలు చేస్తే టీడీపీ ఓర్చుకోలేదని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ మేనిఫెస్టోలో 98 శాతం హామీలను అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని అన్నారు. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, కుంభా రవిబాబు, లేళ్ల అప్పిరెడ్డి, వరు దు కల్యాణి, ఎమ్మె ల్యేలు విశ్వాసరాయి కళావతి, గొర్లె కిరణ్‌కుమార్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ పాల్గొన్నారు. 

సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యం
శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): సామాజిక సాధికారతతోనే సంక్షేమం సాధ్యమవుతుందని సీఎం జగన్‌  నిరూపించారని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు చెప్పారు. గురువారం నుంచి చేపట్టనున్న ‘సామాజిక సాధికారత’ బస్సు యాత్రను జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు, పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తదితరులు శ్రీకాకుళంలో జెండా ఊపి ప్రారంభించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మరి కొన్ని హామీలు కూడా నెరవేర్చారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స చెప్పారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2019 నాటికి పేదరికం 12 శాతం ఉండేదని, ఇప్పుడు 6 శాతానికి తగ్గించామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ బీసీల సాధికారతే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఐదుగురు బీసీ ఉప ముఖ్యమంత్రులు, 56 కార్పొరేషన్‌ చైర్మన్లను నియమించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల దీవెనలు ఉండాలని పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గొర్లె కిరణ్‌ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement