రణస్థలం: శాసన మండలిలో ప్రతిపక్ష నాయ కుడు, మాజీమంత్రి బొత్స సత్యనారాయణను మంత్రి అచ్చెన్నాయుడు కించపరచడం తగదని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు పిన్నింటి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు బొత్స పట్టుబడితే కూటమి నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. అడిగిన దానికి స్పష్టంగా సమాధానం ఇవ్వకుండా ఇలా సభా మర్యాదలు పాటించకపోవడం అచ్చెన్నకు ఏమాత్రం సరికాదన్నారు. ఇప్పటి
కై నా భాష అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేద ఖైదీలు న్యాయ సహాయం పొందాలని, కేవలం పేదరికం కారణంగా జైల్లో ఉండకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. పేద ఖైదీలకు న్యాయ సహాయం, ఆర్థిక సాయం అందించేందుకు నల్సా చేపట్టిన సపోర్ట్ ఆఫ్ పూర్ ప్రిజనర్స్–2025 పథకం ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రధానంగా జరిమానా చెల్లించలేక జైలులో ఉన్న పేద ఖైదీలను గుర్తించి, ప్రభుత్వ నిధుల నుంచి జరిమానా చెల్లించి తక్షణమే విడుదల చేయాలని తెలిపారు. పెండింగ్ కేసులున్న పేద ఖైదీలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయవాద సేవలు అందించడంలో జిల్లాన్యాయ సేవాధికార సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. మానవతా దృక్పథంతో అర్హులైన ప్రతి పేద ఖైదీకి న్యాయం జరిగేలా చూస్తామని, సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేసి ఈ పథకాన్ని విజయవంతం చేయాలి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్, ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సాగునీరు అందించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: వంశధార కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్ పంటలకు సాగునీరందించాలని గార, శ్రీకాకుళం మండలాల వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కి సోమవారం వినతిపత్రం అందజేశారు. వంశధార కుడి, ఎడమ కాలువ పరివాహంలో ఉన్న రైతుల భూములకు ఈ ఏడాది ఖరీఫ్లో సాగునీరు అందక వేలాది ఎకరాల వెద పొలాలు, నారుమడులు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాలు లేవని, ఇప్పటికే సుమారుగా 50 రోజుల పంట ఆలస్యం అయిందన్నారు. సాగునీరు అందించేందుకు అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గొండు రఘురాం, పీసీ శ్రీహరిరావు, బగ్గు అప్పారావు, శిమ్మఽ ధర్మారావు, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
పీఎం పాలెం: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జావం గ్రామానికి చెందిన కర్నైన మనోరమ కుమార్తె అశ్విని (35)కి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలానికి చెందిన ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగి కునుకు జగన్మోహన్రావుతో 2011లో పెద్దల సమక్షంలో వివాహమైంది. ప్రస్తుతం వీరు బక్కన్నపాలెంలోని పీవీఆర్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అశ్విని ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కాగా, తన కుమార్తె అశ్వినిని అదనపు కట్నం కోసం భర్త జగన్మోహన్రావు, అతని సోదరి గేదెల మంజుల, ఆమె భర్త నారాయణమూర్తి వేధించేవారని మృతురాలి తల్లి మనోరమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై గతంలో బూర్జ పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన కుమార్తె మృతికి వారే కారణమని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి ఎస్ఐ రాము దర్యాప్తు చేస్తున్నారు.


