శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ వర్కర్స్(స్వీపర్స్)కు 4 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల శానిటేషన్ (ఆయా) వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శానిటేషన్ వర్కర్లకు తక్కువ వేతనాలు వస్తున్నాయని, వాటిని కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండడం వలన కుటుంబాలను పోషించలేక అవస్థలు పడుతున్నారన్నారు. 300 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించారని, దీంతో కార్మికులపై పనిభారం పెరిగిందన్నారు. పనిభారం తగ్గించాలని, 100 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, వేసవి సెలవుల్లో పనిచేసిన కార్మికులకు సగం జీతం కాకుండా పూర్తి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర, టి.ప్రవీణ్, ప్రభుత్వ పాఠశాల, కళాశాల శానిటేషన్ (ఆయా) వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.పద్మ, డి.చంద్రకళ, టి.హేమ, బి స్వాతి, పి.రాజేశ్వరి పాల్గొన్నారు.


