శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి మొత్తం 182 ఫిర్యాదులు నమోదయ్యాయి. అత్యధికంగా రెవెన్యూ (సీసీఎల్ఏ) శాఖకు సంబంధించి 77 అర్జీలు రాగా, సెర్ప్ విభాగంలో 20, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో 18 అర్జీలు నమోదయ్యాయి. అలాగే స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు విభాగంలో 13, జలవనరుల శాఖకు 10, విద్యుత్ శాఖ పరిధిలో 9 అర్జీలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్కు 6, వ్యవసాయం, సర్వే సెటిల్మెంట్స్ శాఖలకు చెరో 4 చొప్పున వినతులు అందాయి. పాఠశాల విద్యకు సంబంధించి 3, హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పోలీసు శాఖలకు చెరో 2 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. వీటితో పాటు రవాణా, దేవదాయ, గ్రామీణాభివృద్ధి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, కార్మిక శాఖ, సమగ్ర శిక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగాలకు చెరో ఒక అర్జీ అందినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల నుంచి అందిన ఈ వినతులను నిర్దేశిత వ్యవధిలో నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీయ్యాయి. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహా ఆయా శాఖలు ఉన్నతాధికారులు గ్రీవెన్స్లో పాల్గొన్నారు.


