మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి  | Priyanka Gandhi in Zaheerabad Roadshow | Sakshi
Sakshi News home page

మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి 

Nov 29 2023 4:24 AM | Updated on Nov 29 2023 4:24 AM

Priyanka Gandhi in Zaheerabad Roadshow - Sakshi

జహీరాబాద్‌: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజా ర్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫాంహౌస్‌కే పరిమితం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బైబై చెప్పాలన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల కోసం చేసిందేమీ లేదని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, యువతకు ఉద్యోగాలు  ఇవ్వలేదని, పేపర్‌ లీకేజీలు అయ్యాయని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు.  రుణమాఫీ హామీ ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని, ఈ రెండూ ధనిక పా ర్టీలని,  ఈ డబ్బంతా ప్రజలదేనన్నారు. 

ప్రధానికి రెండు విమానాలు 
ప్రధాని నరేంద్రమోదీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు విమానాలను కొనుగోలు చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. దేశంలో రైతు రోజుకు రూ. 27 సంపాదిస్తున్నాడని, మోదీ  స్నేహితుడు అదానీ మాత్రం వేల కోట్లు  సంపాదించారని చెప్పారు. అయినప్పటికీ అదానీకి వేలకోట్ల రూపాయల రుణాలను ప్రధాని మాఫీ చేయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్‌లో అవసరం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ మద్దతునిస్తోందని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు  ఎంఐఎం మద్దతునిస్తోందన్నారు.  

రాహుల్‌పైనే ఒవైసీ విమర్శలు 
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కేసీఆర్, బీజేపీలను విమర్శించరని, కేవలం రాహుల్‌గాం«దీపైనే విమర్శలు చేస్తారని ప్రియాంక తెలిపారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తోందని, తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీకి దిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆమె విమర్శించారు.  

ప్రజలకోసం ఆరు గ్యారంటీలు.. 
తెలంగాణ ప్రజల కోసం ఆరు గ్యారంటీ పథకాలు తెచ్చామని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామ ని ప్రియాంక గాంధీ అన్నారు. ధాన్యంపై ప్రతి క్వింటాలుపై రూ.500 బోనస్‌ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ఆమె వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద స్థలంతో పాటు రూ.5 లక్షల అందిస్తామని, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ యోజన కింద రూ.10 లక్షలతో ఉచిత వైద్యం అందిస్తామన్నారు.

వృద్ధులకు రూ.4వేల పింఛన్‌ అందజేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. నీతి, నిజాయి తీగల తమ పార్టీ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. సభలో కర్ణాటక మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే, మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్, జహీరాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఎస్‌.ఉజ్వల్‌రెడ్డి, నియోజకవర్గం కో–ఆర్డినేటర్‌ ఎన్‌.గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement