ఇటు పునాది రాళ్లు-అటు సమాధి రాళ్లు

Pawan And Chandrababu Bad Propaganda Against Ysrcp Govt - Sakshi

కొన్ని రాజకీయ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా... వారి బుట్టలో పడ కుండా ఓటర్లు విచక్షణతోనే ఓటు హక్కు వినియోగించు కుంటారు. పార్టీల జెండాల కన్నా అజెండాలనే ఓటర్లు ఎక్కువగా పరిగణనలోకి తీసు కుంటారు.  ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఏం హామీలు ఇచ్చారో తెలుసు కుంటారు. వాటిని నమ్మవచ్చో లేదో ఆలోచిస్తారు.  పార్టీలు ఇచ్చిన హామీలు సమాజానికి ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయో బేరీజు వేసుకొంటారు. సమస్త ప్రజానీకానికీ మంచి చేయగలవారికే బాధ్యత గల ఓటర్లు తమ ఓట్లు వేస్తారు.

అయితే ఇవాళ ఇలా ఆలోచించే ఓటర్లను సులువుగా తప్పుదోవ పట్టిస్తున్నాయి కొన్ని టీవీ ఛానళ్ళు, విషపు పత్రికలు. ఈ మీడియావాళ్లకి ఆర్థికంగా వెన్ను దన్నుగా ఉన్నదో తెలుగు ధనవంతుల పార్టీ. ఈ ముగ్గురు కలిసి ఓ బెర్ముడా ట్రయాంగిల్లా ఏర్పడి రాష్ట్రంలో జరుగుతున్న నిజాల్ని సమాధి చేస్తున్నారు. జరిగింది జరగనట్టు... జరగనిది జరిగినట్టుగా కనికట్టు చేస్తున్నారు. ఆ ఛానల్‌ బాక్సుకీ, ఆ పత్రికలకీ కాస్త పక్కకు జరిగి అసలు ఏం జరుగుతోందో గమనించాలి. బడుగు బలహీన వర్గాలు మెరుగు పడితేనే సామాజిక సమతుల్యం ఏర్పడుతుందని తెలుసు కోవాలి. లేదంటే ధనికులకూ, సామాన్యులకూ మధ్య తేడా మరింత పెరుగుతుంది. పెరిగితే, సమాజంలో అరాచకం ప్రజ్వరిల్లుతుంది.

ఒక పక్క వీరిలా చేస్తుంటే, ఇంకో పక్క నుండి రాజకీయం చెయ్యటానికి ఇంకో బాబు వచ్చే స్తున్నాడు. ఆయన ఒకే ఒక పార్టీని.. అది ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా దానినే ప్రశ్నిస్తూ ఉంటాడు. అలా ఎందుకు చేస్తాడనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. ఇతనికి జెండా ఐతే ఉంది గానీ, తాను ముఖ్యమంత్రి అవ్వాలన్న అజెండా మాత్రం లేదు. ఎవరన్నా సొంత పార్టీ పెట్టేది అధికారాన్ని చేపట్టి తామనుకున్న మంచిని ప్రజలకు చేయడానికే. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఎంతో చేయగలుగు తారు. ఇతని వాలకం చూస్తే తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు కనిపించదు. పైగా ‘కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు?’ అన్న ఎదురు ప్రశ్నతో రాజకీయం కానిచ్చేస్తున్నాడు ఈ దత్తత పోయిన పుత్రుడు.

మరి ఇంకో పక్కేమో, అప్పుడే పక్క మీద నుండి లేచిన ఉత్తి బాబొకడు, ‘తెగ లావవుతున్నావు సన్న బడటానికి ఏంచేస్తావు? అనడిగితే నేను పాదయాత్ర చేస్తాన’ని బయలు దేరాడు. ఇతనికి వీర తిలకాలు, వీధి సత్కారాలు కూడా అయ్యాయి. ఇతనికి భవిష్య వాణి బాగా తెలిసినట్టు.. ‘ఇక మేము వచ్చేస్తున్నం, మాకు వచ్చేస్తోంద’ని తెలిసినట్టుగా చెప్తున్నాడు. ఎలా వస్తావని అడుగుదామంటే సెల్ఫీలతో బిజీగా ఉంటున్నాడు.

గతంలో ఉత్త మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావో చెప్పమంటే ‘నాకు తెలియదు, గుర్తు రావ ట్లేదు’... అని గారాలు పోతూ ట్రెండింగ్‌లో ఉన్న గజినీ అవుతున్నాడు. పైగా నాన్నారు చెప్పిందంతా చేశాననే తప్ప, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇత మిద్ధంగా ఇది చేశామని చెప్పడానికి నోరు లేవట్లేదు. ఇదేంటని నిలదీస్తే ‘మా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడొద్దు’ అని నొచ్చుకుంటున్నాడు. ఏమీ సిద్ధం కాకుండానే ఇతను బహిరంగ సభలకు వచ్చేస్తున్న ట్టుంది. తన పాదయాత్రను తెలుగు ధనవంతుల పార్టీ అంతిమ యాత్రలా చేస్తున్నాడు.
చదవండి: ఏది నిజం?: వివేకా హంతకుల్ని నడిపిస్తున్నదెవరు?

ఇలా ఎందుకు ముగ్గురూ కలిసి సిండికేట్‌ అయ్యారు? నిజంగా అధికారంలో ఉన్నవారు తప్పు చేస్తే, తరువాతి ఎన్ని కలు వారికి పాఠాలు మిగులుస్తాయ్‌. 2019 ఎన్నికల ద్వారా ఈ విషయం వీరికి అనుభవపూర్వకంగా తెలుసు. ‘వారిని ఇంటికి పంపండి’, ‘వారిని గద్దె దింపండి’ అన్న నినాదాలే తప్ప... మేమున్నప్పుడు ఇది చేశాం, మేమొస్తే ఇది చేస్తామనటానికి వీరి నోరు పెగలడం లేదు ఎందుకు? అందరూ కలిసి ఒక్కడి మీద ఈ దండగ యాత్ర ఎందుకు? సమాజం మొత్తంతో ముడిపడి ఉన్న పత్రికలు ఒక్కడి మీద కక్ష కట్టడమేంటి? రీల్‌ లైఫ్‌ హీరో, రియల్‌ లైఫ్‌లో విలన్‌ పాత్ర పోషించడం ఏంటి? ‘నలభై ఏళ్లు ఇండస్ట్రీ’ అన్న లీడర్‌ నూట డెబ్భైకి నూట డెబ్భై స్థానాల్లో పోటీ చెయ్యలేక పోవడమెంటి? ఓటర్లు ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. అప్పుడు కానీ వారికి అసలు నిజాలు తెలియవు.

ఆలోచించండి! ప్రజలు ఎన్ను కున్న పాలకులను ఇంత అవహేళన చేస్తే...  ఎన్ను కున్న ఆ ప్రజలను నేరుగా కించ పరిచినట్టేగా. తాము బలపరిచిన పార్టీని గెలిపించలేదనీ ‘ఆ టీవీలూ, పత్రికలూ’; తమను గెలిపించలేదన్న అక్కసు ఆ తెలుగు ధనవంతుల పార్టీ, వారి దత్త పుత్రుడూ అనైతికంగా కలిసి దుష్ప్రచారాలు చేస్తున్న సంగతి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 2024 కోసం ఆతృతగా వీరు ఎదురు చూస్తుంటే... ప్రజలూ కసిగా ఎదురు చూస్తు న్నారు. ఈసారి ప్రజలు వేసే ఓట్లు  సుదీర్ఘమైన పాలనకు పునాదిరాళ్ళు, సిండికేట్‌ ప్రతి పక్షాలకు శాశ్వత సమాధి రాళ్లు కానున్నాయి!

-కంకిపాటి రామ్‌ 
వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top