సింగిల్ బిడ్ వచ్చినా టెండర్ల ప్రక్రియ కొనసాగించి ఖరారు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న భాగం
రూ.348 కోట్ల మంగంపేట బెరైటీస్ టెండర్లో బరితెగింపు
అడిగిందే తడవుగా టెండర్ నిబంధనలు సవరణ
ఒక్క బిడ్ వచ్చినా కాంట్రాక్టు ఖరారు చేసేలా క్లాజు మార్పు
మిగతా కంపెనీల విన్నపాలు బుట్టదాఖలు
ఇంత భారీ టెండర్కు ఇచ్చిన గడువు 20 రోజులే
కూటమి పెద్దలతో లాలూచీ వ్యవహారాలు
సాక్షి, అమరావతి: మంగంపేటలో బెరైటీస్ తవ్వకాలు, ఓవర్ బర్డెన్ తొలగింపు (ఖనిజంపై ఉండే మట్టి, రాయి) కోసం ఏపీఎండీసీ పిలిచిన టెండర్ కాంట్రాక్టును గాయత్రి సంస్థకు ముందే రాసిపెట్టినట్లు స్పష్టమవుతోంది. ముందస్తు అవగాహనతో కూటమి పెద్దలు లాలూచీ పడి ఆ సంస్థకు టెండర్ దక్కేలా నిబంధనలు మార్చడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లెలోని మంగంపేట గనిలో ఖనిజం పైన ఉండే మట్టి, రాయిని తొలగించి ఖనిజాన్ని తవ్వితీసే పనుల కోసం ఇటీవల ఏపీఎండీసీ రూ.348.37 కోట్లతో టెండర్ పిలిచింది.
త్రివేణి అడిగింది.. వెంటనే పచ్చజెండా
మంగంపేట గనిలో తవ్వకాలు నిర్వహిస్తున్న త్రివేణి ఎర్త్ మూవర్స్ కంపెనీ గతేడాది రెండుగా విడిపోయింది. కొత్తగా ఏర్పడిన త్రివేణి ఎర్త్మూవర్స్ అండ్ ఇన్ఫ్రా కంపెనీకి టెండర్కు అవసరమైన అనుభవం, ఆర్థిక అర్హతలు లేవు. అవన్నీ పాత కంపెనీ పేరిట ఉండడంతో ఇటీవల ప్రీబిడ్ సమావేశంలో తాము ఆ టెండర్కి పోటీ పడుతున్నామని, పాత కంపెనీ అర్హతలను తాము వాడుకునేలా టెండర్ నిబంధనల్లో మార్పు చేయాలని ఏపీఎండీసీని కోరింది. అడగడమే ఆలస్యం.. ఏపీఎండీసీ టెండర్ నిబంధనలను సవరించింది.
ఇంకా విడ్డూరం ఏమిటంటే త్రివేణి తన లేఖలో పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వు నంబర్ సహా ఆ కంపెనీ రాసిచ్చిన వాక్యాలే దాదాపు యథాతథంగా సవరణలో చేర్చారు. ఏడాది వయసు ఉన్న కంపెనీ కోసం రూ.348 కోట్ల టెండర్ నిబంధనలను మార్చేశారు. అంతటితో ఆగకుండా టెండర్ వేసేటప్పుడు కట్టాల్సిన రూ.1.7 కోట్ల ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) నిబంధనను సైతం ఆ కంపెనీ కోసం సడలించారు. నగదు బదులు బ్యాంకు హామీ పత్రం ఇచ్చినా చాలంటూ ఆ కంపెనీకి వెసులుబాటు కల్పించారు. మిగిలిన కంపెనీల అభ్యర్థనలను పట్టించుకోలేదు.
ఒక్క బిడ్ వచ్చినా ఓకే..
టెండర్ డాక్యుమెంట్లో ఉన్న మరో క్లాజు త్రివేణి, కూటమి పెద్దల మధ్య జరిగిన లాలూచీని బయటపెడుతోంది. ఎన్ని బిడ్లు వచ్చినా.. చివరకు ఒకే ఒక్క బిడ్ వచ్చినా సరే దాన్ని ఓపెన్ చేసి ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఇంత విలువైన కాంట్రాక్టు టెండర్ల దాఖలుకు కేవలం 20 రోజులు గడువు మాత్రమే ఇచ్చారు. తక్కువ గడువుతో కొత్తవాళ్లకు అవకాశం లేకుండా చేయడం, కావాల్సిన కంపెనీ కోసం నిబంధనలు మార్చడం, చివరకు ఆ ఒక్క కంపెనీ బిడ్ వేసినా టెండర్ ఖరారు చేసి కాంట్రాక్టు కట్టబెట్టే వరకు అంతా పకడ్బందీగా టెండర్లో పొందుపరిచారు.
ధరల పోటీకి మంగళం..
సాధారణంగా ఇలాంటి భారీ టెండర్లలో ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఇస్తారు. ఆన్లైన్లో పోటీపడి ఎవరు తక్కువ రేటుకు పని చేస్తామంటే వారికి కాంట్రాక్టు ఇచ్చేందుకు రివర్స్ ఆక్షన్ ఉంటుంది. అయితే ఈ టెండర్ పత్రాల్లో ఒక చోట రివర్స్ ఆక్షన్ ఉంటుందని, మరో చోట ఉండదని పేర్కొని.. చివరికి ఉండదని తేల్చేసి ఎక్కువ మంది రాకుండా, ధర పెరగకుండా ఏపీఎండీసీయే అడ్డుకుంది. టెండర్లో పోటీ పడాలంటే భారీ యంత్రాలు, వాహనాలు సొంతంగా ఉండాలని షరతు పెట్టి.. ప్రీబిడ్ సమావేశంలో మాత్రం అవన్నీ బిడ్డర్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికేనని, పని చేసేటప్పుడు ఆ యంత్రాలు గనిలో అవసరం లేదని చెప్పడం విశేషం.
గుట్టుచప్పుడు కాకుండా..
మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్ను పారదర్శకంగా జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపి పరిశీలించేవారు. 2021లో ఇదే మంగంపేట గని టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూ, ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జ్యుడీషియల్ ప్రివ్యూని రద్దు చేసింది. ఫలితంగా ఇప్పుడు రూ.348 కోట్ల టెండర్ల ప్రక్రియ మొత్తం గప్చుప్గా జరిగిపోతోంది.


