
ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి
మీడియాతో మంత్రి నారా లోకేశ్ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ‘మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహారశైలి అస్సలు బాలేదు. నియోజకవర్గాల ప్రజల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఫిర్యాదు వచ్చిన ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై సమీక్షిస్తున్నాం. వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం’ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన లోకేశ్.. ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.
‘నాతో సహా మా పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరుపై రివ్యూ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేల పనితీరు, మాట తీరు, వ్యవహారశైలిపై మా వాళ్ల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలను పిలిచి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఇందుకు మూడు నెలల సమయం ఇస్తున్నాం.’’ అని లోకేశ్ అన్నారు.
బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేశ్ భేటీ
ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగం కోసం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ ద్వారా సహకారం అందించాలని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను మంత్రి నారా లోకేశ్ కోరారు. గురువారం ఢిల్లీలో టోనీ బ్లెయిర్తో లోకేశ్ భేటీ అయ్యారు.
రాష్ట్రప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరినట్లు లోకేశ్ ‘ఎక్స్’లో తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను కోరినట్లు లోకేశ్ వెల్లడించారు.