ఓటమి భయంతోనే ‘కామారెడ్డికి’ కేసీఆర్‌ | Mallu Bhatti Vikramarka Comment On KCR | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే ‘కామారెడ్డికి’ కేసీఆర్‌

Aug 22 2023 1:11 AM | Updated on Aug 24 2023 4:44 PM

Mallu Bhatti Vikramarka Comment on KCR - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. సీజన్‌ రాకముందే కోయిల కూసింది అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ప్రత్యేక అభివృద్ధి పేరుతో గజ్వేల్‌ నియోజకవర్గంలో లెక్కలేనంత ఖర్చు పెట్టినా.. అక్కడ గెలిచే పరిస్థితిలేదనే కేసీఆర్‌ మరో చోటుకు వెళ్తున్నారని విమర్శించారు. ఈసారి గజ్వేల్‌లో ఓడిపోతున్నారనే సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్‌ కామారెడ్డికి పారిపోతున్నారని భట్టి అన్నారు.

కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేయాలన్న నిర్ణయంతోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనేది అర్థం అవుతోందని.. బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీలు మారుతారనే ఆందోళనలోనే కేసీఆర్‌ అభ్యర్థుల ప్రకటన ముందే చేశారని అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌కే గెలిచే పరిస్థితి లేకపోతే, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. 

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని.. గెలిచేది కాంగ్రెస్‌ 
పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. ఏ లక్ష్యాలకోసం తెలంగాణ సాధించుకున్నామో.. ఆ లక్ష్యాలన్నీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచి్చనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

కాగా, సెల్ఫీ విత్‌ కాంగ్రెస్‌ అభివృద్ధి అనే కార్యక్రమంతో మరోసారి ప్రజల్లోకి వెళ్తామని.. కాంగ్రెస్‌ హయంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీ తీసుకొని ప్రజలతో పంచుకుంటామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనతో నష్టపోయిన వారందరూ కాంగ్రెస్‌తో కలసిరావాలని భట్టి  విక్రమార్క పిలుపునిచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement