
Lok Sabha Elections 2024: ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ నియోజకవర్గం నుంచి మాజిద్ అలీని బహుజన సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా నిలిపింది. కేఆర్కేగా పిలిచే బాలీవుడ్ నటుడు, నిర్మాత కమాల్ ఆర్ ఖాన్ సోదరుడే మాజిద్ అలీ.
ఈ లోక్సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో మాజిద్ అలీ అత్యంత ధనవంతుడు. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. అలీ మొత్తం ఆస్తులు సుమారు రూ. 160 కోట్లుగా ప్రకటించారు.
మాజిద్ అలీకి రియల్ ఎస్టేట్, మైనింగ్, క్వారీయింగ్, ఆహార ఉత్పత్తులు, దుస్తుల వ్యాపారాలు ఉన్నాయి. అవిసెన్నా స్టోన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తోదర్పూర్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మజిద్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్విజన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి ఆయన నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు.
మాజిద్ అలీ లోక్సభకు పోటీ చేయడం ఇదే తొలిసారి కాగా, ఆయన రాజకీయాలకు కొత్తేమీ కాదు. 2009లో బీఎస్పీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన 2016లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దేవ్బంద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో ఆజాద్ సమాజ్ పార్టీలో చేరి వెంటనే తిరిగి బీఎస్పీకి వచ్చేశారు.