అయోధ్య, బద్రీనాథ్‌లో ఓడిన బీజేపీ కేదార్‌నాథ్‌ కోసం ఏం చేస్తోంది? | Kedarnath Seat elections this seat Important | Sakshi
Sakshi News home page

అయోధ్య, బద్రీనాథ్‌లో ఓడిన బీజేపీ కేదార్‌నాథ్‌ కోసం ఏం చేస్తోంది?

Oct 29 2024 1:21 PM | Updated on Oct 29 2024 3:28 PM

Kedarnath Seat elections this seat Important

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో కేదార్‌నాథ్ ధామ్‌ ఒకటి. త్వరలో కేదార్‌నాథ్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. సోమవారం ఇరు పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. యూపీలోని అయోధ్య, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ స్థానాల్లో ఓడిపోయిన దరిమిలా బీజేపీకి ఇప్పు కేదార్‌నాథ్‌ కీలకంగా మారింది.  

2013లో సంభవించిన భారీ విపత్తు తర్వాత, కేదార్‌నాథ్ ధామ్, కేదార్‌నాథ్ లోయలో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పని ప్రారంభమైంది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక కేదార్‌నాథ్ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రధాని మోదీ తరచూ కేదార్‌నాథ్‌ను సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్రలో అత్యధిక సంఖ్యలో యాత్రికులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 2002 నుంచి ఉనికిలోకి వచ్చిన కేదార్‌నాథ్ అసెంబ్లీలో బీజేపీ మూడుసార్లు, కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి.

కేదార్‌నాథ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి రావత్ మృతి చెందడంతో ఇక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఏడాది అయోధ్యతో కూడిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ, బద్రీనాథ్‌లో కాంగ్రెస్‌ విజయం సాధించాయి. అయోధ్య, బద్రీనాథ్ రెండూ కూడా హిందువుల ఆదరణకు నోచుకున్న ‍ప్రాంతాలు. అందుకే వీటిపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్పుడు కేదార్‌నాథ్‌ సీటును దక్కించుకోవాలని ఉబలాటపడుతోంది.

బీజేపీ తన సంప్రదాయాలకు భిన్నంగా దివంగత ఎమ్మెల్యే శైలారాణి రావత్ కుటుంబంలో ఎవరికీ టిక్కెట్ ఇవ్వకుండా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా నౌటియాల్‌ను ఎన్నికల్లో పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 90 వేల మంది ఓటర్లు ఉన్నారు. కుల సమీకరణల విషయానికి వస్తే ఠాకూర్ ఓటర్ల సంఖ్య ఈ  ప్రాంతంలో అత్యధికం. బీజేపీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెట్టగా, కాంగ్రెస్ ఠాకూర్ అభ్యర్థికి ప్రాధాన్యతనిచ్చింది.

ఇది కూడా చదవండి: 19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement