ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు?  | Kadapa People Angry On Sharmila Comments On YS Viveka Assassination | Sakshi
Sakshi News home page

ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు? 

Apr 5 2024 5:40 PM | Updated on Apr 5 2024 6:41 PM

Kadapa People Angry On Sharmila Comments On YS Viveka Assassination - Sakshi

షర్మిల తీరుపై కడపలో విమర్శలు

రెండేళ్లలో షర్మిలలో వచ్చిన మార్పుపై ప్రశ్నలు

కుటుంబంలో చిచ్చు పెడతారా అంటూ సవాల్‌

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం ఉంది. ఆనాడు వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. అప్పుడు మీనమేషాలు లెక్కించిన వారు ఇప్పుడు 2024లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ముఖ్యంగా షర్మిల చేస్తున్న రాజకీయ ఆరోపణలపై కడపలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల ఎక్కడికి వెళ్లి ప్రచారం చేయాలనుకున్నా.. నేను రాజశేఖరరెడ్డి బిడ్డను అని చెప్పాలనుకున్నా.. ప్రజల మాత్రం జై జగన్‌ నినాదాలు వినిపిస్తున్నారు. 

చెప్పుకోడానికి షర్మిలకు ఏం లేదా?
ఈ ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ షర్మిల చెప్పుకోడానికి ఏమి లేకపోవడంతో మళ్లీ వివేకానంద హత్య కేసుపై పదే పదే ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యను ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 

మాట మారిందెందుకమ్మ.? : రాచమల్లు
వైఎస్‌ కుటుంబ విషయాలను రాజకీయం కోసం షర్మిల వాడుకోవడం సరికాదని హితవు పలికారు రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి. షర్మిలమ్మ తన స్థాయికి మించి, సంబంధం లేని మాటలు మాట్లాడుతోందని తప్పుబట్టారు. వైఎస్‌ఆర్‌ మరణించాక.. ఆయన పేరును కాంగ్రెస్‌ పార్టీ FIRలో చేర్పించిందని, వైఎస్‌ జగన్‌ను అక్రమంగా 15 నెలలు జైలులో పెట్టిందని, రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని.. ఆనాడు షర్మిల అన్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం షర్మిల మాట మార్చడం సరికాదని హితవు పలికారు రాచమల్లు. 

సొంత అన్న అభిమతం తెలుసుకోలేకపోతున్నారు
తెలంగాణాలో తరిమేస్తే ఆంధ్రాలో పడినట్లు నాలుగు ఓట్లు సంపాదించుకునేందుకు షర్మిల వైఎస్‌ పేరును ఉచ్చరించడం సరికాదన్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశాయాలకు, ప్రతిబింబాలకు నిజమైన వారసుడు జగన్‌ మాత్రమేనన్నారు. ఒకే తల్లి కడుపున పుట్టి సొంత అన్న అభిమతం, ఆలోచనలను, మంచి తనాన్ని షర్మిల తెలుసుకోలేపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రక్తంతో తడిచిందంటూ షర్మిల చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు. వైఎస్సార్‌సిపి పేదవాడి చెమటతో నడుస్తోన్న పార్టీ అని పార్టీ, పరిపాలన, జగనన్న ఆలోచన అన్నీ పేదవాడి కోసమేనన్నారు. 

నిన్నటిదాకా తెలంగాణ.. హఠాత్తుగా ఏపీ
నిన్నటిదాకా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలని చెప్పుకున్న షర్మిలకు ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు.  క్యాలెండర్‌లో పేజీ ఎలా మారుతుందో అలా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి పార్టీ మార్చిందని, మాట్లాడే తీరూ మారిందన్నారు. షర్మిలమ్మ ఈ రాష్ట్ర బిడ్డగా, జిల్లా బిడ్డ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిన్నాన్న కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారన్నారు.

చంద్రబాబుకు మద్దతు..కాంగ్రెస్‌కు జీ హుజూర్‌
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీకి మద్దతు ఇస్తూ షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంటి విషయాలను వీధిలో పెట్టి షర్మిల రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్‌ పార్టీకి జీ హుజూర్‌ అని ఎలా అంటున్నారని తెలిపారు. తాను రాజశేఖరరెడ్డి బిడ్డను అంటూ రాజశేఖరరెడ్డిని హీనంగా మాట్లాడిన చంద్రబాబుతో అంతర్గతంగా ఎలా అవగాహన కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. షర్మిల నైతికతకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement