టీడీపీ మూకల దాష్టీకం | Victims allege that TDP MLA Pulivarthi Nanis followers attacked them | Sakshi
Sakshi News home page

టీడీపీ మూకల దాష్టీకం

Aug 2 2026 5:15 AM | Updated on Aug 2 2026 5:15 AM

Victims allege that TDP MLA Pulivarthi Nanis followers attacked them

అంబేడ్కర్‌ చిత్రంతో ఉన్న బ్యానర్‌ చించివేసి దుర్భాషలు  

మీరేమైనా అంబేడ్కర్‌కు పుట్టినోళ్లా అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు  

బొమ్మ పట్టుకుని వస్తే వదిలేయాలా అంటూ హూంకరింపులు  

అంబేడ్కరిస్టులు, దళితులు, మహిళలపై ముప్పేట దాడి  

పంచాయతీ బోరు ఆక్రమణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారని దురాగతం 

చేష్టలుడిగి చోద్యం చూస్తుండిపోయిన పోలీసులు   

పలువురికి తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చికిత్స 

పరామర్శించిన భూమన కరుణాకర్‌రెడ్డి  

టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులే దాడి చేశారన్న బాధితులు   

తిరుపతి రూరల్‌: తిరుపతిలో అంబేడ్కరిస్టులు, దళితులపై టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వారి చేతుల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ చూడగానే చెలరేగిపోయారు.   ‘‘మీరు ఏమైనా అంబేద్కర్‌కు పుట్టినోళ్లా..? బొమ్మ పట్టుకుని వస్తే వదిలేస్తామా..? అంటూ తిట్లదండకం అందుకున్నారు. బ్యానర్‌ను చించివేసి  ఇక్కడి నుంచి వెళ్లకుంటే మీ అందరి అంతు చూస్తాం’’ అంటూ హూంకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటాడి దొరికిన వారిని దొరికినట్టు పిడిగుద్దులు కురిపిస్తూ చితకబాదారు. కొందరిని గొంతు నులిమి చంపేందుకు యత్నించారు. మహిళలపైనా దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన దళితులను స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.  

అసలు ఏం జరిగిందంటే..  
తిరుపతి రూరల్‌ మండలం అవిలాల గ్రామ పంచా­యతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూము­లను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేం­దుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్‌ వెంకటరమణతోపాటు దళితవాడ వాసు­లు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్‌ ఫొటోతో కూడిన బ్యానర్‌ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. 

అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరు­కుని దళితులపై రెచ్చిపోయారు. బూతుపంచాంగం లం­కించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్‌ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణభయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు.  

గాయపడిన వారికి రుయాలో చికిత్స 
టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్‌ వెంకటరమణ, కౌసల్య, విజయనిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు. టీడీపీ గూండాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌చేశారు. దాడికి పాల్పడిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులుగా చెప్పుకునే నవీన్‌ నాయుడు, సునీల్, శంకర్‌ యాదవ్, బాలసుబ్రమణ్యం నాయుడు, పృధ్వీ ఉన్నారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని బాధితులు డిమాండ్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement