హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌ | haryana election: Former MP Ashok Tanwar Joins Congress | Sakshi
Sakshi News home page

హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌

Oct 3 2024 4:08 PM | Updated on Oct 3 2024 5:24 PM

haryana election: Former MP Ashok Tanwar Joins Congress

చండీగఢ్: బీజేపీ నేత, మాజీ ఎంపీ అశోక్ తన్వర్ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు మహేంద్రగఢ్‌లో రాహుల్‌ గాంధీ సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ముందు బీజేపీ చేరిన అశోక్‌ను ఆ పార్టీ సిర్సా లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించగా ఓటమి పాలయ్యారు.

మాజీ కాంగ్రెస్ ఎంపీ అయిన తన్వర్.. 2014 నుంచి 2019 వరకు హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేశారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి.. మరుసటి ఏడాది ఆప్‌లోకి మారారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని అశోక్‌.. వ్యతిరేకిస్తూ  లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆప్‌ని వీడి బీజేపీ చేరారు. సార్వత్రిక ఎన్నికలలో సిర్సా  నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి కుమారి సెల్జా చేతిలో ఓడిపోయారు.

‘‘ సమాజంలోని అణగారిన వర్గాల కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ తన గళం వినిపిస్తుంది. కాంగ్రెస్‌ పోరాటం, అంకితభావానికి ప్రభావితమై.. బీజేపీ నేత, మాజీ ఎంపి, బీజేపీ ప్రచార కమిటీ సభ్యుడు, స్టార్ క్యాంపెయినర్ అశోక్ తన్వార్ కాంగ్రెస్‌లో చేరారు’’ అని కాంగ్రెస్‌ ఎక్స్‌లో పేర్కొంది.

గురువారం ఉదయం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తన్వర్ ట్వీట్ చేయడం గమనార్హం. అనంతరం కాంగ్రెస్ ర్యాలీలో  ఎంపీ రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హర్యానా రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్‌ 5న (శనివారం) పోలింగ్ జరగనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement