
సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత( రోడ్డెక్కారు. ఆమెకు తీవ్ర అవమానం జరగడమే అందుకు కారణంగా తెలుస్తోంది. నాగాయలంక మండల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సమావేశంలో గ్రామపార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రసాద్ ఏమైందో తెలియదుగానీ ఒక్కసారిగా స్వర్ణలతతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరేశారు. ఆ దురుసు ప్రవర్తనతో ఆమె షాక్ తిన్నారు. అవమాన భారంతో కంటతడి పెట్టిన ఆమె రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలైన తనకే అలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై ఆమె తన మాటల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మహిళలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా?. ఉప్పల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నినాదాలు చేశారామె. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు పీఎస్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పీఎస్కు వెళ్లగా.. విషయం తెలిసిన పార్టీ నేతలు కొందరు ఆమెకు సర్దిచెప్పి ఫిర్యాదు చేయించకుండానే బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం.