కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు | Fresh twist as MLA Bandla decides to continue in Congress | Sakshi
Sakshi News home page

కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారు

Aug 2 2024 5:18 AM | Updated on Aug 2 2024 5:18 AM

Fresh twist as MLA Bandla decides to continue in Congress

మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎమ్మెల్యే బండ్లతో మంత్రి మంతనాలు..

పాత మిత్రులను కలసి మాట్లాడితే పార్టీ మారినట్లు కాదని స్పష్టీకరణ

గద్వాల రూరల్‌: ‘అసెంబ్లీలో పాతమిత్రులు కనిపిస్తే వెళ్లి మాట్లాడినంత మాత్రాన పార్టీ మారినట్లు మీడియా కథనాలు రాయడం సరైంది కాదు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు’అని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలసి గద్వాలలోని ఎమ్మెల్యే బండ్ల నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డితో మంతనాలు చేయడంతో పాటు ఆయనతో కలసి అల్పాహారం చేశారు.

అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారన్నారు. పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యం ఉంటుందని, ఎక్కడా ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నెట్టెంపాడు, ర్యాలంపాడు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేకపోవడంతో కొంత మనస్తాపానికి గురైనట్లున్నారని పేర్కొ న్నారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీలో అందరికీ సమాన అవకాశాలుంటాయని, పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని చెప్పారు. గద్వాల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికే ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారారనే ప్రచారం కేవలం అపోహ మాత్రమేనన్నారు. అనంతరం ఆయన కృష్ణమోహన్‌రెడ్డిని తన వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement