flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు ! | Flash Back Politcs Of Tdp Chief Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఫ్లాష్‌ బ్యాక్‌.. పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు !

Jan 9 2024 4:30 PM | Updated on Feb 2 2024 5:14 PM

Flash Back Politcs Of Tdp Chief Chandrababu Naidu - Sakshi

డాక్టర్‌ సి.రంగరాజన్‌ 1997 నుంచి 2003 వరకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. 2003లో రాజన్‌ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా ఢిల్లీ వెళ్లి, అదే ఏడాది ఆగస్టులో తన టీమ్‌తో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. ‘‘చేసిన అప్పులు చాలు. ఇక చెయ్యకండి’’ అని చంద్రబాబు ప్రభుత్వానికి చెప్పడానికే ఆయన బృందం పని కట్టుకుని హైదరాబాద్‌ వచ్చింది!

ఇక్కడ బాబు 2004 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ‘‘ఎలాగైనా చేసి ఓ 650 కోట్ల రూపాయలు ఇద్దురూ, పొయ్యిలో పిల్లి లేవడం లేదు’’ అని రాజన్‌ని మొహమాటం లేకుండా అడిగేశారు చంద్రబాబు. రాజన్‌ ఆశ్చర్యపోయారు. ‘‘ఎలాగైనా?’’ అంటే అన్నారు. మనసుంటే మార్గం ఉండదా అన్నట్లు రాజన్‌ వైపు చూసి, ‘‘మీ చేతుల్లో పనే కనుక, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేసి, ఆ పథకాల మీద కేంద్రం ఖర్చు చేస్తున్న నిధులకు సమానమైన మొత్తాన్ని రాష్ట్రాలకు సమానంగా పంచండి’’ అన్నారు!

పనిలో పనిగా చంద్రబాబు రాజన్‌కు ఇంకో సలహా కూడా ఇచ్చారు. ‘‘కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయం నుంచి కూడా 50 శాతం తీసి రాష్ట్రాలకు ఇవ్వండి. ముందైతే మాకు 650 కోట్లు ఇవ్వండి’’ అన్నారు! చంద్రబాబును అలా చూస్తూ రాజన్‌ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. ఏపీకి రాజన్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఎ.ఎం. ఖుస్రో ఉన్నారు.

 రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది జాగ్రత్త అని చంద్రబాబును ఖుస్రో ఎన్నోసార్లు హెచ్చరించడం రాజన్‌ కళ్ల ముందు కదలాడింది. ‘‘నాయుడు గారూ.. మీ దగ్గర్నుంచి కేంద్రానికి వచ్చేది లేకపోగా, కేంద్రం నుంచే మీరు నిధులు అడుగుతున్నారు.. అదెలా సాధ్యం అవుతుంది? గొంతెమ్మ కోరిక కాకపోతే..’’ అన్నారు రాజన్‌. 2004 ఎన్నికల ముందు నాటికి ఏపీ ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసింది.

రాష్ట్రానికి డబ్బులు తెచ్చిపెట్టే నీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యుత్‌ రంగాలు నిర్లక్ష్యానికి గురై కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చడంతో వడ్డీతో కలిపి తడిసి మోపెడయింది. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా వచ్చాక కానీ రాష్ట్రం కొంచెం తేరుకోలేదు. అదే చంద్రబాబు ఇప్పుడు.. ముఖ్యమంత్రి YS జగన్‌ మోహన్‌రరెడ్డి ప్రభుత్వ అప్పులపై గగ్గోలు పెడుతున్నారు. తను చేస్తే అప్పు.. జగన్‌ చేస్తే తప్పా.? ప్రపంచ విజనరీ అని డప్పు కొట్టే వారు కాస్తా సెలవివ్వాలి.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement