జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని | Ex Minister Kodali Nani Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని

May 3 2024 7:18 PM | Updated on May 3 2024 7:47 PM

Ex Minister Kodali Nani Comments On Chandrababu

జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.

సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అంటే తనకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ. అందుకే విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు.

‘‘పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు. పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.. లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు.. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారు’’ అని కొడాలి పేర్కొన్నారు.

‘‘పెద్ద ఎన్టీఆర్‌ను దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను. ఎన్టీఆర్.. వైఎస్సార్ నాకు రెండు కళ్లు. తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.  సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించింది’’ అని కొడాలి నాని చెప్పారు.

‘‘ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు.. నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూ.ఎన్టీఆర్‌ను ఒక విఐపిగా గౌరవిస్తాం’’ అని కొడాలి పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement