నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్‌లో కలకలం! | Dead Person Reached To File Nomination In Varanasi | Sakshi
Sakshi News home page

నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్‌లో కలకలం!

May 9 2024 12:29 PM | Updated on May 9 2024 1:13 PM

Dead Person Reached To File Nomination In Varanasi

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్‌ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.

సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.

సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్‌కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే  అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.

రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్‌ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు.

Advertisement
 
Advertisement
Advertisement