షీలా లేని లోటు.. ఢిల్లీ కాంగ్రెస్‌కు గడ్డుకాలం? | Congress will Contest Elections Without Sheila | Sakshi
Sakshi News home page

Lok Sabha Elections-2024: షీలా లేని లోటు.. ఢిల్లీ కాంగ్రెస్‌కు గడ్డుకాలం?

Apr 7 2024 7:32 AM | Updated on Apr 7 2024 7:32 AM

Congress will Contest Elections Without Sheila - Sakshi

సుదీర్ఘకాలం పాటు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్ సారధ్యం లేకుండా తొలిసారిగా ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. 2019 జూలై 20న షీలా దీక్షిత్‌ కన్నుమూశారు. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఢిల్లీలో కాంగ్రెస్‌ ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.  

షీలా దీక్షిత్‌ కన్నుమూయడం, పార్టీ సీనియర్ నేతల్లో చాలామందికి వయసు మీద పడటంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ భుజస్కంధాలపై పడింది. ఢిల్లీలోని మూడు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల గెలుపు బాధ్యత లవ్లీపైననే ఉంది. దీనితోపాటు ఇండియా  కూటమిలోని నాలుగు సీట్ల విషయంలో అతను ‘ఆప్‌’కు సహకరించాల్సి ఉంటుంది. 

1984 నవంబర్ నాటి అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్ కుమార్ దోషిగా తేలడంతో జైలులో ఉన్నారు. ఇదే కేసులో మరో నేత జగదీష్ టైట్లర్ దశాబ్దన్నర కాలంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సుభాష్ చోప్రాతో పాటు షీలా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలలోని పలువురు వృద్ధాప్య దశకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని రాబోయే ఎన్నికల్లో ముందుకు నడిపించే బాధ్యత లవ్లీపైనే ఉంది.

గతంలో ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి లవ్లీ  పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో లవ్లీ తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ కూడా ఎన్నికల బాధ్యతలు చేపట్టి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు.

షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీ కాంగ్రెస్‌ 1999 లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వచ్చింది. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆమె భారీ విజయాన్ని అందించారు. 2014లో ఆమె కేరళ గవర్నర్‌గా ఉన్నందున ఆమె నేరుగా లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేకపోయారు. అయితే ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు.

ఆరోగ్యం సహకరించకపోయినా షీలా 2019 లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. షీలాతో సహా కాంగ్రెస్ అభ్యర్థులంతా ఓడిపోయినా, షీలా నాయకత్వంలో పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది. ఐదు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు 2014 ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement