
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం తీసుకుందని ధ్వజమెత్తారు సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారం పోయిన తర్వాత చాలా పెద్ద పెద్ద మాటలు కవిత మాట్లాడుతుంది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకులేవా?, మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా?, అధికారం పోగానే సామాజిక తెలంగాణ గుర్తుకు వచ్చిందా?’ అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి.
రాహుల్ గాంధీ నాయకత్వంలో, సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక ప్రజా పరిపాలన కొనసాగుతుందని, తెలంగాణలో గొంతు విప్పి మాట్లాడే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. ఆ స్వేచ్ఛలోనే కవిత గొంతు కూడా మాట్లాడుతుందన్నారు. కొత్త కొత్త రాగాలు ఎంచుకుని, నటించడం కవిత కుటుంబానికే సాధ్యమని, కేసీఆర్ ది నటనతో కూడిన పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజా పాలన అని స్పష్టం చేశారు.
‘ఎవరికైనా నష్టం జరిగిదే... స్వేచ్ఛ గా ఇందిరాపార్కు దగ్గర నిరసన చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు. అందుకే మా ప్రభుత్వం స్వేచ్ఛ ను ఇచ్చింది. ఇందిరాపార్కు మాత్రమే కాదు... ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వెల్లినా నిరసన చేసే స్వేచ్ఛ ఇచ్చింది. సామాజిక తెలంగాణ కోరుకుంటే.. కులగణన చేసి సామాజిక తెలంగాణ సాదిస్తున్నాం. కొత్త సెలబస్ తో తెలంగాణ ప్రజలను మోసం చేసేలా మీ ప్రకటన ఉంది.
బిఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇంకో పదేళ్లు ఉంటుంది. బిఆర్ఎస్ అధికారంలోకి తెచ్చుకుని బందీలుగా ఉండాలని ఎవరూ అనుకోరు.కేసీఆర్ పదేళ్ల లో సామాజిక తెలంగాణ కోసం పనిచేయలేదని కవిత చెప్పకనే చెప్పింది.కవితకు తెలియకుండానే మనసులో మాట బయటకు వచ్చింది’ అని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి.