మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు | CM Revanth Reddy extends Ramzan greetings, assures continuation of reservation for Muslims | Sakshi
Sakshi News home page

మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు

Mar 16 2024 6:02 AM | Updated on Mar 16 2024 6:11 AM

CM Revanth Reddy extends Ramzan greetings, assures continuation of reservation for Muslims - Sakshi

శుక్రవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ

4 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది 

వర్సిటీల వీసీ నియామకాల్లో మైనారిటీలకూ అవకాశం కల్పిస్తాం 

మైనారిటీ గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు 

ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడి

సాక్షి, హైదరాబాద్‌:  ‘ బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసే సత్తా అమిత్‌ షాకు లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంజాన్‌ ఉప వాస దీక్షల సందర్భంగా శుక్రవారం మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ ఎంతో మంది న్యాయ నిపుణులతో చర్చించి రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు అన్ని రంగాల్లో అవకాశాలను మెరుగుపర్చాం.

అదనపు అడ్వొకేట్‌ జనరల్, మైనారిటీ సలహాదారు, ముఖ్యమంత్రి కార్యాలయం, వక్ఫ్‌బోర్డు చైర్మన్, టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా మైనారిటీలను నియమించాం. మైనారిటీల సంక్షేమానికి మా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఒక యూని వర్సిటీకి వీసీగా మైనారిటీలకు అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. హైదరాబాద్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాతబస్తీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజానికి అది ఓల్డ్‌ సిటీ కాదు..ఒరిజినల్‌ సిటీ..అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మైనారిటీ గురుకులాలకు అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలను నిర్మిస్తాం.

ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల ప్రక్రియ ఎల్బీస్టేడియం వేదికగా నిర్వహి స్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టింది ఎల్బీ స్టేడియం నుంచే. అదే స్ఫూర్తితో  ఇక్కడి నుంచే  పలు కార్యక్రమాలు అమలు చేస్తు న్నాం’ అని సీఎం వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement