జూపల్లి కోసం శాలువా, కుర్చీ సిద్ధం చేశామంటున్న కేటీఆర్, అరెస్ట్ సమయంలో తోపులాటలో కింద పడ్డ హరీశ్
అవినీతి, అప్పులపై అధికార, ప్రతిపక్ష పార్టీల సవాళ్లు
గన్పార్క్, తెలంగాణ భవన్ వేదికగా వేడెక్కిన రాజకీయం
గన్పార్క్ వద్దకు వచ్చిన ముగ్గురు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజహర్
మరోవైపు తెలంగాణ భవన్లో హరీశ్రావు, కేటీఆర్
మంత్రి జూపల్లి కోసం అక్కడే వేచి చూసిన కేటీఆర్
తెలంగాణ భవన్కు వెళ్లకుండా గన్పార్క్ వద్దకు వచ్చిన జూపల్లి
సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో గన్పార్కుకు బయల్దేరిన హరీశ్రావు, కేటీఆర్
ఉద్రిక్తతలకు అవకాశం ఉండటంతో ఇద్దరినీ అడ్డుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో గురువారం రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు, బీఆర్ఎస్ హయాంలో అప్పుల విమర్శలు ఇందుకు కారణమయ్యాయి. ఆయా అంశాలపై చర్చకు సిద్ధమన్న ఇరుపక్షాలు ఎలాంటి చర్చలూ జరగకుండానే గన్పార్క్, తెలంగాణ భవన్ వేదికగా పరిస్థితిని రచ్చరచ్చగా మార్చాయి. ముగ్గురు మంత్రులు గన్పార్క్ వద్దకు చేరుకుని మరోసారి విపక్షానికి సవాల్ విసరగా, గన్పార్క్ వద్ద చర్చకు సై అన్న విపక్ష నేతలు హరీశ్రావు, కేటీఆర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గన్పార్క్ వద్ద మాట్లాడిన మంత్రులు, తెలంగాణ భవన్లో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు.
రెండు రోజులుగా మాటల యుద్ధం
అవినీతి, అప్పులపై ఉభయ పార్టీల మధ్య గత రెండు రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన బహిరంగ సభల్లో పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సై అంటూనే అప్పులకు సంబంధించిన తప్పుడు లెక్కలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ స్పందించారు. మరోవైపు గురుకులాల్లో విద్యార్థులకు సరఫరా చేసే యూనిఫాం, విద్యా కిట్లలో రూ.2 వేల కోట్ల భారీ అవినీతి జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు హరీశ్రావు, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సవాల్ చేయగా, తాము సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలోనే గురువారం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ గన్పార్కు వద్దకు వచ్చారు. బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ లేదా హరీశ్రావు తమతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో ప్రత్యేకంగా దీనిపై చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. 
గన్పార్క్ వద్ద జూపల్లి, అడ్లూరి, అజహర్, పొన్నం
కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు హరీశ్ తరలింపు
మంత్రులతో గన్పార్కు వద్ద చర్చకు తాను సిద్ధమంటూ హరీశ్రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు. కానీ తాను వెళ్లి తీరతానంటూ హరీశ్ పట్టుపట్టడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు తరలించారు.
తెలంగాణ భవన్లోనే కేటీఆర్
బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అప్పులపై తనతో చర్చించేందుకు రావాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సవాల్ చేసిన కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు వచ్చారు. అయితే తెలంగాణ భవన్కు వస్తానన్న జూపల్లి రాకపోగా.. గన్పార్క్కు రావాలంటూ సవాల్ చేయడంతో.. కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్ వెళ్లడానికి బయలుదేరారు. కానీ ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..మీ మంత్రులు పారిపోయామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, తాను గన్పార్క్కు వెళ్తానని అన్నా సరే ఆయన తెలంగాణ భవన్ దాటి రాకుండా పోలీసులు నిలువరించారు.
అప్పుల గణాంకాలు వెల్లడించిన జూపల్లి
గాందీభవన్లో జరిగిన ప్రజలతో ముఖాముఖి అనంతరం నేరుగా గన్పార్క్కు చేరుకున్న మంత్రి జూపల్లి 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు, 2023లో బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను గణాంకాలతో సహా వివరించారు. తాను చెప్పిన గణాంకాలు తప్పని కేసీఆర్తో చెప్పిస్తే తాను చెప్పిన కట్టుబడి రాజీనామా చేస్తానని మరోమారు కేటీఆర్కు సవాల్ విసిరారు.
మళ్లీ తెలంగాణ భవన్కు హరీశ్
ఉదయం పోలీసులు అదుపులో తీసుకున్న మాజీ మంత్రి హరీశ్రావు కంచన్బాగ్ పోలీస్స్టేషన్ నుంచి నేరుగా మళ్లీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అయితే చివరకు రెండు పార్టీల నేతలు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవినీతి, అప్పులపై చర్చించాలని పట్టుపట్టడం గమనార్హం. ఇలావుండగా మరో ప్రధాన పార్టీ బీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. ఆ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.


