రేవంత్‌.. మీ గురువులకే చుక్కలు చూపించిన వ్యక్తి కేసీఆర్‌: కవిత | BRS MLC Kavitha Satirical Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. మీ గురువులకే చుక్కలు చూపించిన వ్యక్తి కేసీఆర్‌: కవిత

Dec 2 2024 3:27 PM | Updated on Dec 2 2024 3:30 PM

BRS MLC Kavitha Satirical Comments On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అంటూ కామెంట్స్‌ చేశారు.

కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ ఒక వేగుచుక్క.

రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్. గత కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవి.. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయి. బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై లేని పన్నులు.. ప్రధాని మోదీ ప్రభుత్వంలో మాత్రం జీఎస్టీ రూపంలో విధించడం మన దౌర్భాగ్యం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని  రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement