ఆ రెండూ ప్రతిష్టాత్మకమే | Sakshi
Sakshi News home page

ఆ రెండూ ప్రతిష్టాత్మకమే

Published Tue, May 7 2024 1:29 AM

BRS focus on Secunderabad Cantonment by election: telangana

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపైనా వ్యూహం

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉపఎన్నికలను బీఆర్‌ఎస్‌  ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్‌ ఎన్నికలతోపాటే  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ తర్వాత  ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలు కావడంతో వాటిని తిరిగి గెలుచుకోవడంపై బీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక రాగా,  ఈ నెల 13న జరిగే లోక్‌సభ పోలింగ్‌తోపాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్‌ జరగనుంది. మరోవైపు ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా పల్లా పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. తాజాగా  ఎన్నికల కమిషన్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 27న పోలింగ్‌ జరుగుతుంది.

లాస్య నందిత సోదరి కోసం.. 
మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో తమ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించగా, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గ ప్రచార ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక డివిజన్‌ వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని పనిచేస్తున్నారు.

అయితే ఇక్కడ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ఆశావహులు గజ్జెల నాగేశ్‌ కేసీఆర్‌ బస్సు యాత్రలో ఉండగా, ఎర్రోⶠ్ల శ్రీనివాస్‌ సంగారెడ్డి ప్రచార సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నివేదిత తరపున సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు మాజీ సభ్యులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రచారంపై ఆ ప్రభావం పడకుండా చూడాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశించారు. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్‌ సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో రెండు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్‌షోల్లో పాల్గొన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.

నేడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌
శాసనమండలి ఆరంభం నుంచి బీ ఆర్‌ఎస్‌ అభ్యర్థులే ‘వరంగల్‌– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఈ స్థానానికి జరుగు తున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్‌ రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. రాకేశ్‌ రెడ్డి మంగళ వారం నల్ల గొండ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేస్తారు. బీఆర్‌ ఎస్‌ టికెట్‌ పార్టీ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్‌ రాజు తదితరులు ఆశించారు. 

అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ రెడ్డికి టికెట్‌ దక్కింది. ఇక్కడ గెలుపును బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ న్వయంతో పనిచేయడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించాలని భావి స్తోంది. దీంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధి నేత కేసీఆర్‌ ఈ నెల 12న లేదా 14న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో తెలంగాణభవన్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement