సుఖ్‌బీర్‌ సింగ్‌పై కాల్పులు.. కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు | Arvind Kejriwal Claims conspiracy to defame Punjab In attack on Sukhbir Singh Badal | Sakshi
Sakshi News home page

స్వర్ణదేవాలయంలో సుఖ్‌బీర్‌ సింగ్‌పై కాల్పులు.. కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

Dec 4 2024 5:39 PM | Updated on Dec 4 2024 5:46 PM

Arvind Kejriwal Claims conspiracy to defame Punjab In attack on Sukhbir Singh Badal

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో మాజీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై జరిగిన హత్యాయత్నంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవిద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. శిరోమణి అకాలీదళ్‌ నేత బాదల్‌ జరిగిన కాల్పుల ఘటన.. పంజాబ్ ప్రతిష్టను తీసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించారు. సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడిలో అనేక శక్తులు పాల్గొన్నాయని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. నేడు పంజాబ్‌లో ఊహించని ఓ సంఘటన జరిగిందన్నారు. పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.

పంజాబ్ మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులకు ప్రయత్నించాడు. కానీ ఈఘటనలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను నేను ఖండిస్తున్నాను. అయితే పంజాబ్, పంజాబీ ప్రజల పరువు తీసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నది ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.. ఇందులో అనేక శక్తులు ఉన్నాయి' అని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ అన్నారు.

అయితే కాల్పుల సమయంలో పంజాబ్‌ పోలీసులు వ్యవహరించిన తీరును కేజ్రీవాల్‌ ప్రశంసించారు. అంతేగాక ప్రతిచోటా పంజాబ్‌లో శాంతిభద్రతలపై  ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

కాగా సర్వదేవాలయం ఎదుట సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై బుధవారం తెల్లవారుజామున హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆయన సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు బాదల్‌పై కాల్పులకు తెగబడ్డాడు. అయితే అతని వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమవ్వడంతో బుల్లెట్లు గోడను తాకాయి. ఈ ప్రమాదంలో బాదల్‌కు ఎలాంటి గాయాలు అవ్వలేదు.

కాల్పులు జరిపిన వ్యక్తిని మాజీ ఉగ్రవాది నరైన్‌ సింగ్ చౌరాగా గుర్తించారు. గతంలో అతడు ఖలిస్తానీ కార్యకలాపాల్లో అలాగే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)  ఉగ్రవాదిగా పనిచేసినట్లు తెలిసింది.

కాల్పుల ఘటన అనంతరం సుఖ్‌బీర్‌ తన శిక్షను కొనసాగించారు. సతీమణి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌తో కలిసి స్వర్ణదేవాలయంలో వంటపాత్రలు శుభ్రం చేశారు. ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ స్పందించారు. ‘సుఖ్‌బీర్‌ బాదల్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించా’’ అని వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement