‘ఇదేం పాలసీ.. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..?’ | AP Minister Ambati Rambabu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఇదేం పాలసీ.. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..?’

Sep 14 2022 2:43 PM | Updated on Sep 14 2022 2:51 PM

AP Minister Ambati Rambabu Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంతో వేల కోట్ల నష్టం జరిగిందన్నారు.
చదవండి: కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో టీడీపీ నేతలు పాత్రధారులు: దేవినేని అవినాష్‌

‘‘పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. ఇప్పటికైనా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని’’ మంత్రి హితవు పలికారు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి చేతులెత్తేశారు. మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు.

‘‘నేను ముఖ్యమంత్రి అయితే తప్ప శాసన సభకు రానని చంద్రబాబు మంగమ్మ శపథం చేశాడు. నేను రాను అంటూనే శాసన సభ ప్రాంగణంలోకి ముర్ముకి ఓటు వేయడానికి వచ్చాడు. నువ్వు రావు కానీ.. నీ ఎమ్మెల్యేలు వస్తారా..? నీది ఒక పాలసీ...నీ పార్టీది ఒక పాలసీ ఉంటుందా?’’ అంటూ అంబటి ఎద్దేవా చేశారు.

‘‘ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పాదయాత్ర. అమరావతి అనేది ఓ పెద్ద స్కామ్‌. ఆ కుంభకోణానికి పునాది వేసింది చంద్రబాబే. అమరావతి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నారా?. వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం. మూడు ప్రాంతాల అభివృద్ధే మాకు ముఖ్యం. అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలనుకోవడం తప్పా?’’ అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement