Home Minister Amit Shah On Manipur Riots In Lok Sabha - Sakshi
Sakshi News home page

'చల్లారుతోంది.. అగ్నికి ఆజ్యం పోయెుద్దు..' ప్రతిపక్షాలపై అమిత్ షా ఫైర్..

Published Wed, Aug 9 2023 7:30 PM

Amit Sha On Manipur Riots In Lok Sabha - Sakshi

ఢిల్లీ: మణిపూర్ అంశంపై చర్చకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధంగానే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ అంశంలో దాచడానికి ఏమీ లేదని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం మౌన వ్రతం పాటించడంలేదని చెప్పారు. మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన సమయంలో కేంద్ర సహాయ మంత్రి 23 రోజులు అక్కడే గడిపారని పేర్కొన్నారు. తాను కూడా స్వయంగా మూడు రోజులు పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దినట్లు వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు గంటలపాటు మాట్లాడారు. 

సరికాదు..
ప్రస్తుతం అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అమిత్ షా చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల వీడియోపై కూడా ఆయన మాట్లాడారు. ఈ ఘటన సిగ్గుచేటని కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఆ వీడియోను పోలీసులకు ఇవ్వాల్సిందని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు రిలిజ్ చేయడం సరికాదని అన్నారు.

అగ్నికి ఆజ్యం
ప్రతిపక్షాలు చేసే చర్యలు అగ్నికి ఆజ్యం పోసే దిశగా ఉన్నాయని అమిత్‌ షా ఆరోపించారు. మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటనలను కేంద్రం కూడా సమర్థించడం లేదని చెప్పారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.  

శాంతి నెలకొంటోంది..
మణిపూర్ ఘటనపై అక్కడి సీఎంను మార్చాల్సిన పనిలేదని అమిత్ షా అన్నారు. బీరేన్ సింగ్ చక్కగా స్పందిస్తున్నారని.. మాట వినకపోతే తొలగిస్తారని చెప్పారు. ఈ ఘటనలో సరిగా వ్యవహరించని అధికారులను మార్చినట్లు చెప్పారు. మణిపూర్‌లో శాంతి పరిస్థితులు నెలకొనడానికి అన్ని ప్రయత్నాలను కేంద్రం చేస్తోందని అన్నారు.

మే3 నాడు అల్లర్లు ప్రారంభమయ్యాయని అమిత్ షా చెప్పారు. నేటికి అవి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ 152 మరణించగా.. ఒక్క మే నెలలోనే 107 మంది మృతి చెందినట్లు లోక్‌సభలో పేర్కొన్నారు. రెండు తెగలు మైతీ, కుకీల మధ్య గొడవ ప్రారంభమైనట్లు చెప్పారు. రెండు వర్గాలతో చర్చలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించిన కారణంగానే ఘర్షణలు ప్రారంభమయ్యాయని అన్నారు. 

ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ!
 

Advertisement
Advertisement